బీఆర్ఎస్‌ అంటూనే తండ్రిని ఎంత మాటనేశారో?

Kalvakuntla Kavitha addressing media while criticising KCR and BRS leadership

నిన్న జరిగిన సిఎం రేవంత్ రెడ్డి, కేసీఆర్‌ పోటాపోటీ సభలపై ఇప్పటికే పలువురు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. తాజాగా కల్వకుంట్ల కవిత స్పందిస్తూ, ‘దొందూ దొందే’నని ఒక్క ముక్కలో చెప్పేశారు. అటు తండ్రి కేసీఆర్‌కి, ఇటు సిఎం రేవంత్ రెడ్డి ఇద్దరికీ ఎంతసేపు తమ రాజకీయాలు, పదవులు, అధికారం గురించి ఆలోచనలే తప్ప ప్రజలు, ప్రజా సమస్యల గురించి పట్టవన్నారు.

ఆమె తండ్రి కేసీఆర్‌ని పేరు పెట్టి విమర్శించే బదులు బీఆర్ఎస్‌ పార్టీ అంటూ విమర్శలు గుప్పించారు. కేసీఆర్‌ గురించి ఆమె ఏమ్మన్నారంటే “నేటికీ అదే అహంకారం. బీఆర్ఎస్‌ పార్టీని ఓడించి ప్రజలు పెద్ద తప్పు చేశారు. కనుక అనుభవించండి అంటూ మాట్లాడటం చూస్తే బీఆర్ఎస్‌ పార్టీ (కేసీఆర్‌) తీరు వెయ్యేళ్ళయినా మారదనిపిస్తుంది.

ADVERTISEMENT

75 ఏళ్ళ వృద్ధుడిని పార్టీలో చేర్చుకుని, ‘మీరే నవ యువకులని, మీరే తెలంగాణని కాపాడాలంటూ మాట్లాడటం చూసినప్పుడు, మరైతే రాష్ట్రంలో యువత చచ్చిపోయారా?బ్రతికున్నారా? వీళ్ళే రాష్ట్రానికి దిక్కయితే మరి యువత పరిస్థితి ఏంటి? వారి ఫ్యూచర్ ఏంటి? నాకేమి అర్థం కావడం లేదు,” అంటూ కవిత తండ్రి కేసీఆర్‌కి, జీవన్ రెడ్డికి చురకలు వేశారు.

కేసీఆర్‌ చెప్పిన రాజకీయ శక్తుల పునరేకీకరణ అంటే తెలంగాణ ఉద్యమాలను, తెలంగాణ ఏర్పాటుని తీవ్రంగా వ్యతిరేకించిన జీవన్ రెడ్డి లాంటి వాళ్ళను తెచ్చి చంకనెక్కించుకోవడమా? ఓ పక్క తెలంగాణ కోసం తమ పిల్లలను బలి చేసుకున్న అమరవీరుల కుటుంబాలు రోడ్డుపై ముష్టెత్తుకుంటుంటే, నాకు వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆశీర్వాదం ఉంటే చాలు తెలంగాణ అవసరం లేదన్న్ జీవన్ రెడ్డిని పార్టీలో చేర్చుకోవడానికి సిగ్గనిపించడం లేదా?” అని తండ్రి కేసీఆర్‌ని కవిత ప్రశ్నించారు.

బీఆర్ఎస్‌ పార్టీ జాతీయ పార్టీ అని చెప్పుకుంటునప్పుడు, “డీలిమిటేషన్‌, మహిళా రిజర్వేషన్ బిల్లు గురించి (కేసీఆర్‌) సభలో ఒక్క ముక్క మాట్లాడలేదు. ఇంత పెద్ద సభ పెట్టి మహిళలకు అండగా నిలబడతామని భరోసా ఇవ్వలేకపోయారు. ప్రధాని మోడీ, బిజేపిల గురించి ఒక్క ముక్క మాట్లాడే ధైర్యం లేదు,” అంటూ తండ్రి కేసీఆర్‌పై కల్వకుంట్ల కవిత విమర్శలు గుప్పించారు.

గత ఏడాది ఇదే నెలలో బీఆర్ఎస్‌ పార్టీ ప్లీనరీ సభలో కేసీఆర్‌ ప్రసంగాన్ని ఆమె ఇదేవిధంగా తప్పు పట్టారు. అందుకు పార్టీ నుంచి బహిష్కరించబడ్డారు. కానీ ఇప్పుడు సొంత పార్టీ పెట్టుకుంటున్నారు కనుక విమర్శల పదును మరింత పెరిగింది. ఈ నెల 25న పార్టీ ప్రకటన తర్వాత కల్వకుంట్ల కవిత మరింత దూకుడుగా వ్యవహరించే అవకాశం ఉంది.

ADVERTISEMENT
Latest Stories