తెలంగాణ సిఎం కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత ఆరోపణలు ఎదుర్కొంటున్న ఢిల్లీ లిక్కర్ స్కామ్కు, ఆమె పోరాడుతున్న మహిళా రిజర్వేషన్ బిల్లుకు ఏమైనా సంబందం ఉందా?అంటే లేదనే అనిపిస్తుంది. కానీ ఈ కేసులో ఆమెకు ఈడీ, సీబీఐ విచారణలు మొదలైన తర్వాత ఆమె చట్ట సభలలో మహిళలకు రిజర్వేషన్లు కల్పించాలంటూ పోరాటం మొదలుపెట్టి, ఈడీ విచారణకు ముందు మహిళా రిజర్వేషన్ బిల్లు గురించి దీక్షలు, చర్చలు నిర్వహిస్తుండటంతో ఈ రెంటికీ ఏదో సంబందం ఉన్నట్లనిపిస్తుంది.
లిక్కర్ స్కామ్లో ఆమె ఇవాళ్ళ మళ్ళీ ఈడీ విచారణకు హాజరుకాబోతున్నారు. ఒకరోజు ముందు అంటే బుదవారం కల్వకుంట్ల కవిత ఢిల్లీలో మహిళా రిజర్వేషన్ బిల్లుపై రౌండ్ టేబిల్ సమావేశం నిర్వహించారు. కనుక ఈ రెంటినీ కలిపి చూడాల్సివస్తోంది.
ఈ కేసు విచారణకు హాజరవుతున్నందున, బహుశః దేశవ్యాప్తంగా మహిళల సానుభూతి మద్దతు కూడగట్టుకొనేందుకు, వీలైతే జాతీయ మహిళానేతగా గుర్తింపు సంపాదించుకోవడం కోసమే కల్వకుంట్ల కవిత హటాత్తుగా ఈ అంశాన్ని భుజానికి ఎత్తుకొని ఉండవచ్చనే వాదనలు వినిపిస్తున్నాయి.
ఒకవేళ ఆమెకు దీనిపై పోరాడాలనే చిత్తశుద్ధి, తపన ఉన్నట్లయితే పార్లమెంటు సభ్యురాలిగా ఉన్నప్పుడే పోరాటం చేసి ఉండవచ్చు కదా? కానీ అప్పుడు ఈ ఊసే ఎత్తలేదు. తన తండ్రి స్థాపించిన బిఆర్ఎస్ పార్టీలో మహిళలకు రిజర్వేషన్లు ఇవ్వాలని కోరవచ్చు. కానీ కోరలేదు. కేసీఆర్ మొదటిసారి అధికారంలోకి వచ్చినప్పుడు ఆయన మంత్రివర్గంలో మహిళలకు ఎందుకు అవకాశం ఇవ్వలేదని ప్రశ్నించి ఉండవచ్చు కానీ ప్రశ్నించలేదు.
నిన్న నిర్వహించిన సమావేశంలో కూడా తమ బిఆర్ఎస్ పార్టీ రాజ్యాంగంలో మహిళాలకు రిజర్వేషన్లు కల్పించాలనే నిబందన లేదని కల్వకుంట్ల కవిత స్వయంగా చెప్పుకొన్నారు. బిఆర్ఎస్ ఎమ్మెల్సీగా ఉంటూ సొంత పార్టీలో, ప్రభుత్వంలో మహిళా రిజర్వేషన్ అమలు కోసం పోరాడకుండా, పార్లమెంటులో మహిళా రిజర్వేషన్ బిల్లు పెట్టాలని పోరాడటం దేనికి?
అయినా అపారమైన రాజకీయ అనుభవం, క్షేత్రస్థాయి రాజకీయాలపట్ల మంచి అవగాహన కలిగిన కల్వకుంట్ల కవితకు రాజకీయపార్టీలు మహిళలకు ఎందుకు ఎక్కువ సీట్లు కేటాయించడం లేదో తెలియదా?రాజకీయాలంటే వందలు, వేలు, లక్షల కోట్ల వ్యాపారంగా మారిన ఈరోజుల్లో మహిళలకు 33% సీట్లు కేటాయించాలంటే ఏ పార్టీ అయినా అంగీకరిస్తుందా?ముందు ఆమే తండ్రి కేసీఆర్ అయినా అంగీకరిస్తారా?అంటే కాదనే చెప్పవచ్చు.
ఒకవేళ ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ, సీబీఐ పిలుపులు రాకపోయుంటే కల్వకుంట్ల కవిత మహిళా రిజర్వేషన్ల కోసం పోరాటం చేయాలనే ఆలోచన చేసి ఉండేవారే కారేమో?ఏది ఏమైనప్పటికీ ఆమె ముందుగా తండ్రిని ఒప్పించి తమ బిఆర్ఎస్ పార్టీలోనే మహిళలకు 33 లేదా 50 % సీట్లు కేటాయింపజేయాలని, ఆ తర్వాత నిజాయితీగా పోరాడి చట్ట సభలలో మహిళలకు రిజర్వేషన్ సాధించాలని కోరుకొందాము.





