తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆంధ్రప్రదేశ్ పర్యటన ఖరారయింది. ఈ నెల 21వ తేదీ మంగళవారం నాడు తిరుమల వెంకన్న దర్శనానికి బయల్దేరుతున్నారు. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తదితరులతో కలసి ప్రత్యేక విమానంలో మంగళవారం మధ్యాహ్న సమయానికి రేణిగుంట విమానాశ్రయం చేరుకుంటారు. అలాగే రాత్రి తిరుమల కొండపైనే బస చేసి, 22వ తేదీ తెల్లవారుజామున స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకుంటారు. ఈ సందర్భంగా 5.59 కోట్ల విలువైన సాలగ్రామ హారం, కంఠాభరణాలను వేంకటేశ్వరస్వామి వారికి సమర్పించుకుంటారు.
అనంతరం తిరుపతిలోని పద్మావతి అమ్మవారిని దర్శించుకుంటారు. ఈ సందర్భంగా అమ్మవారికి ముక్కుపుడకను సమర్పించుకుంటారు. అనంతరం సాయంత్రం తిరిగి హైదరాబాదు చేసుకుంటారు. ఈ నేపథ్యంలో, గతంలో టీటీడీ కార్యనిర్వాహక అధికారిగా పనిచేసిన ఐఏఎస్ అధికారి రమణాచారి ఈ రోజు తిరుమల పయనమవుతున్నారు. ఆయనతో పాటు రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ శివశంకర్ కూడా తిరుమల వెళ్లి, అక్కడ ఏర్పాట్లను పర్యవేక్షించనున్నారు. తెలంగాణ ఏర్పాడాలని కోరుతూ తిరుమల వెంకన్నను కేసీఆర్ మొక్కుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన రేపు ఆయన మొక్కులు చెల్లించుకోనున్నారు.



