రెండు రోజులపాటు బెంగళూరులో జరిగిన బిజెపియేతర పార్టీల సమావేశాలకు తమను ఆహ్వానించనందుకు మజ్లీస్ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ పార్టీకి చెందిన సీనియర్ నేత వారిస్ పటాన్ హైదరాబాద్లో మీడియాతో మాట్లాడుతూ, “మేము సెక్యులర్ పార్టీలమని వాళ్ళు చెప్పుకొంటారు. కానీ మమ్మల్ని వారి సమావేశానికి పిలవలేదు. ఒకప్పుడు బిజెపితో అంటకాగిన ఉద్ధవ్ థాక్రే, నితీశ్ కుమార్, మెహబూబా ముఫ్తీ లాంటి వాళ్ళు, కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీని రాహుల్ గాంధీని విమర్శించిన అర్వింద్ కేజ్రీవాల్ని కూడా ఈ సమావేశానికి ఆహ్వానించారు. వారు కూడా నిరభ్యంతరంగా వెళ్ళి పాల్గొన్నారు.
మేము కూడా 2024 లోక్సభ ఎన్నికలలో బిజెపిని ఓడించాలని గట్టిగా ప్రయత్నిస్తూనే ఉన్నాము. కానీ ఇండియా పేరుతో కూటమి పెట్టుకొన్న ప్రతిపక్షాలు హైదరాబాద్లోని మా పార్టీని పట్టించుకోలేదు. మోడీని గద్దె దించాలనుకొన్నప్పుడు అందరినీ కలుపుకు పోయెందుకు ప్రయత్నించాలి కానీ ఈవిదంగా ప్రవర్తింకఃడమ్ సరికాదు,” అని అన్నారు.
హైదరాబాద్ పాతబస్తీ కేంద్రంగా ముస్లిం ఓటు బ్యాంకునే నమ్ముకొని రాజకీయాలు చేస్తున్న మజ్లీస్ పార్టీ, తెలంగాణ సిఎం కేసీఆర్తో కలిసి పనిచేస్తోంది. కేసీఆర్ కాంగ్రెస్, బిజెపిలకు సమాన దూరం పాటించాలని భావిస్తున్నందున దేశంలో ఏ పార్టీతో కూడా ఆయన కలిసి పనిచేయలేని పరిస్థితి ఆయనే స్వయంగా కల్పించుకొన్నారు.
కనుక ఆయనకు విధేయంగా, ఆయన కనుసన్నలలో మజ్లీస్ పార్టీ పనిచేస్తున్నప్పుడు అది కూడా కేసీఆర్ వైఖరినే పాటించాలి. పాటిస్తుందనే ఆలోచనతోనే దానిని ‘ఇండియా’ దూరం పెట్టి ఉండవచ్చు.
ఇదీగాక కేసీఆర్ ప్రధాని నరేంద్రమోడీపై కత్తులు దూస్తున్నప్పటికీ వారిద్దరి మద్య రహస్య అవగాహన ఉందనే కాంగ్రెస్, ప్రతిపక్షాలు భావిస్తున్నాయి. కనుక కేసీఆర్కు విధేయంగా వ్యవహరిస్తున్న మజ్లీస్ పార్టీని కూటమిలో చేర్చుకొంటే, అది కూటమి ఆలోచనలను, వ్యూహాలను కేసీఆర్ చెవిలో వేసే ప్రమాదం ఉంటుంది. కేసీఆర్ ద్వారా మోడీ, అమిత్ షాలకు తమ వ్యూహాలు తెలిసిపోయే ప్రమాదం ఉంటుంది. కనుకనే మజ్లీస్ పార్టీని దూరం పెట్టి ఉండవచ్చు. కనుక మజ్లీస్ పార్టీ కేసీఆర్ను నమ్ముకొని ముందుకు సాగాల్సిందే.



