మోడీ ప్రభుత్వంపై బిఆర్ఎస్‌ కూడా అవిశ్వాస తీర్మానం దేనికి?

Narendra Modi versus KCRమణిపూర్ ఘటనలపై కేంద్ర ప్రభుత్వ వైఖరి నిరసిస్తూ ప్రతిపక్షాలు నేడు పార్లమెంటులో మోడీ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాయి. కాంగ్రెస్‌, మిత్రపక్షాలు కలిసి ‘ఇండియా’ పేరుతో కూటమిగా ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారిగా ఆ కూటమిలో అన్ని పార్టీలు కలిసి ప్రవేశపెట్టిన తీర్మానం ఇది.

ఈ ఇండియా కూటమిలో కాంగ్రెస్‌తో దేశవ్యాప్తంగా వివిద రాష్ట్రాలలో అధికారంలో ఉన్న లేదా ప్రతిపక్షంలో ఉన్న 26 పార్టీలు ఈ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాయి. అయితే పార్లమెంటులో వాటికి తగినంత బలం లేకపోవడం వలన ఆ తీర్మానాన్ని అవి గెలిపించుకోలేకపోయిన సభలో అత్యధిక సభ్యులు మోడీ ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తున్నారనే స్పష్టమైన సంకేతాన్ని దేశ ప్రజలకు పంపగలుగుతాయి. కనుక అవి అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడం పెద్ద ఆశ్చర్యకరమైన విషయమేమీ కాదనే చెప్పాలి.

ADVERTISEMENT

మణిపూర్ అల్లర్లను నియంత్రించడంలో మోడీ ప్రభుత్వం దారుణంగా విఫలమైందని, తాము పార్లమెంటులో గట్టిగా నిలదీస్తుండటంతో ప్రధాని నరేంద్రమోడీ పార్లమెంటుకు రాకుండా మొహం చాటేస్తున్నారని ఇండియా సభ్యులు ఆరోపిస్తున్నారు. అందుకే ఆయనను పార్లమెంటుకి రప్పించి సంజాయిషీ ఇప్పించేందుకు చివరి అస్త్రంగా మేము దీనిని ప్రయోగిస్తున్నామని కాంగ్రెస్‌ ఎంపీ మాణిక్‌రావు థాక్రే చెప్పారు.

అయితే కేవలం 9 మంది ఎంపీలున్న బిఆర్ఎస్ పార్టీ కూడా నేడే వేరేగా మోడీ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడం, పైగా ‘ఇండియా పాటే’ పాడుతుండటమే చాలా విడ్డూరంగా ఉంది.

దానిని ప్రవేశపెట్టిన ఆ పార్టీ ఎంపీ నామా నాగేశ్వరరావు, పార్లమెంట్ బయట మీడియాతో మాట్లాడుతూ, “మణిపూర్ అల్లర్లపై యావత్ దేశ ప్రజలు చాలా ఆందోళన చెందుతున్నారు. కనుక వాటిపై ప్రధాని నరేంద్రమోడీ నోటితో స్వయంగా వివరణ ఇస్తే అందరూ శాంతిస్తారనే ఉద్దేశ్యంతో మేము అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాము,” అని చెప్పారు.

పార్లమెంటులో ఇండియా కూటమికి ఎంతో కొంత బలం ఉంది కనుక అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టినా అర్దం ఉంది. కానీ బిఆర్ఎస్‌కు పెద్దగా బలం లేనప్పటికీ తీర్మానం ప్రవేశపెట్టింది. దానికో బలమైన కారణం కనిపిస్తోంది.

తెలంగాణలో కాంగ్రెస్‌ నేతలు ‘బిజెపికి బిఆర్ఎస్ బీ టీమ్‌’, బిజెపి-బిఆర్ఎస్ మద్య రహస్య అవగాహన ఉంది. బిఆర్ఎస్‌కు ఓట్లేస్తే బిజెపిని గెలిపించిన్నట్లే అంటూ గట్టిగా ప్రచారం చేస్తున్నారు. ఈ ప్రచారం వలన త్వరలో జరుగబోయే శాసనసభ ఎన్నికలలో బిఆర్ఎస్‌ పార్టీకి చాలా నష్టం కలిగే ప్రమాదం ఉంటుంది. కనుక తాము కూడా బిజెపిని నిజంగానే చాలా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని తెలంగాణ ప్రజలకు నచ్చజెప్పేందుకే బిఆర్ఎస్‌ పార్టీ ఈ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన్నట్లు భావించవచ్చు.

కానీ ‘ఇండియా’తో కలవబోమని చెప్పి, ఇప్పుడు ఈ తీర్మానం విషయంలో ‘ఇండియా పాటే’ బిఆర్ఎస్‌ కూడా పాడుతున్నందున, తెలంగాణలో బిజెపి నేతలు, బిఆర్ఎస్‌-కాంగ్రెస్ పార్టీల మద్య రహస్య అవగాహన ఉంది. కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు గెలిచినా ఎన్నికల తర్వాత ఎలాగూ బిఆర్ఎస్‌ పార్టీలో చేరిపోతారు కనుకనే కేసీఆర్‌ ‘ఇండియా’తో కోరస్ పాడుతున్నారని ఆరోపించకుండా ఉండరు.

ఇంతకాలం కేసీఆర్‌ కాంగ్రెస్‌, బిజెపిలతో చెడుగుడు ఆడుకోగా ఇప్పుడు ఆ రెండు పార్టీలు ఆయనతోనే చెడుగుడు ఆడుకొంతుండటం విశేషం. ‘అందరిదీ ఓ దారి అయితే నా ఒక్కడిదీ వేరే దారి’ అని కేసీఆర్‌ అనుకోవడం వలననే ఇటువంటి సమస్యలను పుట్టుకొస్తున్నాయని చెపొచ్చు.

ADVERTISEMENT
Latest Stories