ఢిల్లీ లిక్కర్ కేసు ఆరోపణలు, అరెస్టులతో బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత రాజకీయ జీవితం జైలుకు బెయిలుకు మధ్య ఊగిసలాడుతుంది. లిక్కర్ కేసులో అరెస్టైన కవిత గడిచిన రెండు నెలల నుంచి తీహార్ జైలు లో బెయిలు కోసం ఎదురు చూస్తున్నారు. అయితే ఈ కేసు విచారణ చేపట్టిన ఢిల్లీ రౌస్ రెవెన్యూ కోర్ట్ కవిత కేసులో తీర్పును రిజర్వ్ చేసింది.
ఇటువంటి కీలక సమయంలో ఈ కేసు విషయంలో కేసీఆర్ పాత్ర పై ఈడీ అధికారులు కొన్ని ఆసక్తి కరమైన వ్యాఖ్యలు చేసారు. ఢిల్లీ లిక్కర్ వ్యాపారం గురించిన ప్రతి అంశం కేసీఆర్ కు తెలిసే జరిగిందని, కవిత ఈ స్కామ్ తాలూకా ప్రతి విషయాన్ని కేసీఆర్ తో చర్చించిన తరువాతే నిర్ణయాలు తీసుకున్నారని ఈడీ అధికారులు వెల్లడించారు.
కవిత పరిచయం చేసిన టీం ద్వారా ఈ వ్యాపార వ్యవహారాలన్నీ కేసీఆర్ తెలుసుకున్నారని, బుచ్చిబాబు పరిచయం చేసిన సమీర్ మహేంద్రతో కేసీఆర్ భేటీ అయిన వివరాలను గోపి కుమారన్ తన వాగ్మూలంలో రికార్డ్ చేయడం జరిగిందని ఈడీ తెలిపింది.
కవిత ఈ రెండేళ్ల సమయంలో దాదాపు 11 మొబైల్స్ మార్చడం జరిగిందని, ఇందులో 4 ఫోన్లలో సమాచారాన్ని కవిత ధ్వంసం చేసారని న్యాయస్థానానికి తన వాదన వినిపించింది ఈడీ. దీనితో ఈ లిక్కర్ స్కామ్ లో కవిత వెనుక ఉన్న పెద్ద తలకాయ ఆమె తండ్రి కేసీఆరేనా అంటూ వార్తలు ప్రచారంలోకి వచ్చాయి.
దీనితో ఈ కేసులో ఈడీ అధికారుల నెక్స్ట్ టార్గెట్ కేసీఆరే అంటూ ఊహాగానాలు మొదలయ్యాయి. ఒక పక్క ఇప్పటికే కవిత తీహార్ జైలులో ఊచలు లెక్కపెడుతున్నారు. మరోపక్క కేటీఆర్ ఫోన్ టాపింగ్ ఆరోపణలతో చిక్కులలో ఇరుక్కున్నారు. ఇటువంటి సమయంలో కేసీఆర్ పై కూడా ఈడీ అధికారుల నుండి ఇటువంటి ఆరోపణలు ఎదుర్కోవడం బిఆర్ఎస్ పార్టీకి కోలుకోలేని దెబ్బే అవుతుంది.




