గతంలో జగన్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు శాసనసభ సమావేశాలకు హాజరయ్యి అధికార టీడీపీ సభ్యులను గట్టిగా ఎదుర్కొనేవారు. అప్పుడు శాసనసభలో ఎన్ని అవమానాలు ఎదురైనా ఓపికగా భరించేవారు. ఆ తర్వాత పాదయాత్ర చేసి ముఖ్యమంత్రి అయ్యారు.
ఆ తర్వాత చంద్రబాబు నాయుడు కూడా అదేవిదంగా శాసనసభ సమావేశాలకు హాజరయ్యి జగన్, వైసీపీ ఎమ్మెల్యేలు చేసిన అవమానలన్నీ భరించారు. తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి ఎన్నికలలో గెలిచి ముఖ్యమంత్రి అయ్యారు.
వీరిద్దరూ ఇంచుమించు ఒకే రకమైన అవమానకర పరిస్థితులు ఎదుర్కొని, ప్రజల సానుభూతి పొందారు. తర్వాత సర్వశక్తులు ఒడ్డి పోరాడి అధికారంలోకి వచ్చారని స్పష్టమవుతోంది.
జగన్ చేతిలో దారుణంగా అవమానాలు పాలైన చంద్రబాబు నాయుడు, సిఎం పదవి చేపట్టగానే ఏదో కేసులో జగన్ని అరెస్ట్ చేసి జైల్లో వేయగలరు. కానీ ఆవిదంగా చేసినందుకే ప్రజలలో జగన్ పట్ల వ్యతిరేకత పెరిగి, తన పట్ల సానుభూతి పెరిగిందని, అదే వైసీపీ ఓటమికి దారి తీసిందని సిఎం చంద్రబాబు నాయుడుకి బాగా తెలుసు.
కనుక ఒకవేళ జగన్ శాసనసభ సమావేశాలకు వస్తే, ఆయనపై విరుచుకుపడి ప్రతీకారం తీర్చుకోవాలని ప్రయత్నించకుండా కూటమి సభ్యులను కట్టడి చేస్తూ చాలా జాగ్రత్తగానే జగన్ని హ్యాండిల్ చేసి ఉండేవారు.
కనుక ఒకవేళ జగన్ శాసనసభకు హాజరైతే కూటమి ప్రభుత్వాన్ని ఎదుర్కోవడానికి తప్పక అవకాశం లభించి ఉండేది.
జగన్ శాసనసభకు వెళ్ళకుండా చాలా తెలివిగా తప్పించుకున్నానని అనుకుంటున్నారు. కానీ శాసనసభకు వెళ్ళి ప్రజా సమస్యల గురించి మాట్లాడే ప్రయత్నంలో అవమానాలు ఎదుర్కొని ప్రజల సానుభూతిని పొందాల్సిన జగన్, శాసనసభకు రానని మొండికేస్తూ ప్రజల దృష్టిలో ప్రజాస్వామ్యాన్ని, చట్టసభలని గౌరవించని ఓ చెడ్డ రాజకీయ నాయకుడుగా నిలుస్తున్నారు.
అంటే ఈ వ్యూహం కూడా బెడిసికొట్టిందన్న మాట! జగన్ అనాలోచిత నిర్ణయం వలన కూటమి ప్రభుత్వానిదే పైచేయి అయ్యింది కూడా.
అంతేకాదు.. నేటికీ జగన్ పార్టీలో సీనియర్ల సలహాలు, సూచనలు తీసుకోకుండా ఏక పక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారనే విషయం కూడా బయటపడింది. అందువల్లే బొత్స సత్యనారాయణ వంటివారు కూడా ఈ అంశంపై జగన్కు మద్దతుగా గట్టిగా మాట్లాడటం లేదనుకోవచ్చు.
అధికారంలో ఉన్నప్పుడు తాను పట్టిన కుందేలుకి మూడే కాళ్ళని జగన్ వాదించడాన్ని అర్దం చేసుకోవచ్చు. కానీ ఎన్నికలలో ఇంత ఘోరంగా ఓడిపోయిన తర్వాత కూడా జగన్ ధోరణి మారకపోతే వైసీపీని ఎవరు కాపాడగలరు?
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కల్వకుంట్ల కవిత చిక్కుకున్నప్పుడు ఆమెను కాపాడుకోవడం కోసం కేసీఆర్ తన పార్టీని బలి పెట్టుకున్నారు. అదేవిదంగా ఇక్కడ జగన్ కూడా తన ఆహానికి వైసీపీని బలి పెట్టుకుంటున్నారు.




