నేడు హైదరాబాద్లో హుస్సేన్ సాగర్ సమీపంలో 125 అడుగుల డా.అంబేడ్కర్ విగ్రహాన్ని తెలంగాణ సిఎం కేసీఆర్ ఆవిష్కరించారు. రాష్ట్రం నలుమూలల నుండి 750 బస్సులలో వేలాదిమందిని ఈ కార్యక్రమం కోసం హైదరాబాద్కు తీసుకువచ్చారు. రాజుగారు తలుచుకొంటే విందులకు కరువా అన్నట్లు చాలా అట్టహాసంగా విగ్రహావిష్కరణ కార్యక్రమం జరిగింది.
రాజ్యాంగ రచయిత డా.అంబేడ్కర్ విగ్రహావిష్కరణ చేయడమంటే ఆయన ఆశయాలను కొంతలో కొంతైనా పాటించవలసి ఉంటుంది. రాజ్యాంగం ప్రజాస్వామ్యానికి, హక్కులకు ప్రతీక అనుకొంటే, దానిని రచించిన డా.అంబేడ్కర్ దళిత, బడుగు బలహీనవర్గాల ప్రజల పోరాటాలకి ప్రతీకగా నిలుస్తున్నారు. కనుక ఈరోజు ఆయన జయంతి రోజున ఇంత భారీ విగ్రహావిష్కరణ జరుపుకోవడం చాలా సంతోషకరమైన విషయమే.
అయితే రాజ్యాంగం, హక్కుల గురించి ప్రస్తావించుకొంటున్న ఈ కార్యక్రమానికి రాజ్యాంగబద్దమైన పదవిలో ఉన్న తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తెలంగాణ ప్రభుత్వం ఆహ్వానించనేలేదు! ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుకొంటున్న ఈ కార్యక్రమానికి రాష్ట్రంలో ప్రతిపక్షాలను ఆహ్వానించనే లేదు! ఇది పూర్తిగా బిఆర్ఎస్ ప్రైవేట్ కార్యక్రమం అన్నట్లు నిర్వహించారు.
కనీసం ఇటువంటి సందర్భంలోనైనా పంతాలు, పట్టుదలలు, బేషజాలు, రాజకీయ ద్వేషాలు పక్కన పెట్టి తెలంగాణ ప్రభుత్వం గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ని, ప్రతిపక్షాలను ఈ కార్యక్రమానికి ఆహ్వానించి ఉంటే, ఈ వేదికపై నుంచి చేస్తున్న ప్రసంగాలకు కొంతలో కొంత విలువ, అర్దం ఏర్పడేవి.
డా.అంబేడ్కర్ రచించిన రాజ్యాగాన్నే తప్పు పట్టిన కేసీఆర్, ఆయన విగ్రహావిష్కరణ చేయడం చాలా విడ్డూరంగా ఉందని వైఎస్ షర్మిల ఎద్దేవా చేయగా, దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానని, వారికి మూడెకరాలు పంచిపెడతానని మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కేసీఆర్కి, డా.అంబేడ్కర్ విగ్రహాన్ని తాకే అర్హత కూడా లేదని బండి సంజయ్ వాదించారు.
ఈ వాదనలు వాటిలో నిజానిజాలను పక్కన పెడితే కేసీఆర్ ఏం చేసినా చాలా దూరదృష్టితో ఆలోచించి చేస్తారని చెప్పవచ్చు. ఈ ఏడాదిలోగా తెలంగాణ శాసనసభ ఎన్నికలు, తర్వాత వెంటనే లోక్సభ ఎన్నికలు జరుగబోతున్నాయి. బిఆర్ఎస్ పార్టీతో జాతీయరాజకీయాలలోకి ప్రవేశించాలని కేసీఆర్ అనుకొంటున్నారు. కనుక ఈ విగ్రహావిష్కరణ కూడా వాటి కోసమే అనే వైఎస్ షర్మిల వాదనలో ఎంతో కొంత నిజం ఉన్నట్లే అనిపిస్తుంది.



