ఎంకి పెళ్ళి సుబ్బి చావుకి వచ్చిన్నట్లు, ప్రధాని నరేంద్రమోడీ తెలంగాణ సిఎం కేసీఆర్ గురించి చెప్పిన మాటలతో ఏపీ సిఎం జగన్మోహన్ రెడ్డికి పెద్ద ఇబ్బంది వచ్చిపడింది.
తెలంగాణ మంత్రి హరీష్ రావు ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ, “తెలంగాణ సిఎం కేసీఆర్ ఎప్పుడు ఢిల్లీ వచ్చి తనను కలిసిన నీళ్ళు, ప్రాజెక్టులు, అభివృద్ధి పనుల గురించే అడుగుతుంటారని ప్రధాని నరేంద్రమోడీ స్వయంగా పార్లమెంటులో చెప్పారు. కానీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు ఢిల్లీకి వచ్చి తనను కలిసినా అక్రమస్తుల కేసుల గురించే మాట్లాడుతుంటారని ప్రధాని నరేంద్రమోడీ చెప్పారు.
బీజేపీ పెద్దలు ఢిల్లీలో ఉన్నప్పుడు కేసీఆర్ని పొగుడుతుంటారు. కానీ తెలంగాణ రాష్ట్రానికి వచ్చినప్పుడు ఈవిదంగా అర్దంపర్ధంలేని మాటలు మాట్లాడుతుంటారు. నీళ్ళు, ప్రాజెక్టులు, అభివృద్ధి పనుల గురించి మాత్రమే మాట్లాడే కేసీఆర్ గురించి ప్రధాని నరేంద్రమోడీ ఈవిదంగా మాట్లాడుతున్నప్పుడు, ఏ అభివృద్ధిచేయని ఏపీ సిఎం జగన్మోహన్ రెడ్డి గురించి ఏమి మాట్లాడుతారో?” అని ఎద్దేవా చేశారు.
మంత్రి హరీష్ రావు కాస్త సొంత కవిత్వం జోడించి కేసీఆర్ గురించి గొప్పగా చెప్పుకొన్నప్పటికీ, ఆయన ఎన్డీఏలో చేరాలనుకోవడం, తన కుమారుడు కేటీఆర్ని ముఖ్యమంత్రి చేయాలనుకోవడం అబద్దం కాదు. గతంలో కేసీఆర్ రెండు ప్రయత్నాలు చేశారు కూడా. కనుక ప్రధాని నరేంద్రమోడీ బయటపెట్టిన విషయాలను అబద్దాలుగా కొట్టి పడేయలేము. మోడీని విమర్శిస్తున్న బిఆర్ఎస్ నేతలెవరూ కూడా అవి అబద్దమని ఖండించకపోవడమే నిదర్శనం.
అయితే ఏపీ సిఎం జగన్ గురించి తెలంగాణ మంత్రి హరీష్ రావు చెప్పిన విషయాలు నిజమే అని అందరికీ తెలుసు. కనుక ఒకవేళ ప్రధాని నరేంద్రమోడీ జగన్ గురించి మాట్లాడవలసి వస్తే చాలా విషయాలు బయటపెట్టాల్సి ఉంటుంది.
ఒకవేళ ప్రధాని నరేంద్రమోడీ వచ్చి మాట్లాడకపోయినా ఏపీ బీజేపీ మాట్లాడగలదా?అంటే అనుమానమే. చంద్రబాబు నాయుడు అరెస్ట్ విషయంలో మోడీ, అమిత్ షాలు మౌనం వహిస్తుండటం ద్వారా ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి కాళ్ళు, చేతులు, కళ్ళు, నోరు, చెవులు అన్నీ కట్టేసిన్నట్లయింది. కనుక ప్రస్తుత పరిస్థితులలో ఆమె కూడా జగన్ గురించి ఏమీ మాట్లాడలేరు. కానీ జగన్ ఢిల్లీ ఎందుకు వెళుతున్నారో ఎవరో చెప్పాల్సిన అవసరమే లేదు. ముంజేతి కంకణాన్ని చూసుకోవడానికి అద్దం అవసరం లేదు కదా?



