వైసీపీ, బిఆర్ఎస్ రెండు పార్టీల విధానాలలో ఎప్పుడూ కొంత అయోమయం లేదా అవకాశవాదం కనిపిస్తుంటుంది. ఉదాహరణకు కేసీఆర్ బిఆర్ఎస్ పార్టీతో జాతీయ రాజకీయాలు చేయాలనుకున్నారు. కానీ తెలంగాణ విషయానికి వచ్చేసరికి పక్కా ప్రాంతీయ పార్టీలా వ్యవహరిస్తుంటారు! ఇది బిఆర్ఎస్ పార్టీ విదానంలో అయోమయాన్ని, అవకాశవాదాన్ని సూచిస్తోంది కదా?
మోడీతో సఖ్యతగా ఉన్నంత కాలం మోడీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రతీ బిల్లుకి కేసీఆర్ మద్దతు ఇచ్చారు. మోడీతో చెడగానే ఆయనపై కత్తులు దూస్తూ ప్రతీ బిల్లుని వ్యతిరేకించారు.
ఢిల్లీ మద్యం కేసులో తనని అరెస్ట్ చేయబోతున్నారని కల్వకుంట్ల కవిత పసిగట్టినప్పుడు, మహిళలకు 35 శాతం రిజర్వేషన్స్ కల్పించాలని కోరుతూ ఢిల్లీలో ధర్నా చేశారు. కానీ ఇప్పుడు ఆ ఊసే ఎత్తడం లేదు. అంటే మహిళలకు రిజర్వేషన్ అంశాన్ని కూడా ఆమె రాజకీయంగానే వాడుకున్నారు తప్ప దానిపై చిత్తశుద్ది లేదన్న మాట! ఇప్పుడు ఆమె తెలంగాణ తల్లి అంశానికి షిఫ్ట్ అయిపోయి దానిపై పోరాటం మొదలుపెట్టడం కూడా అటువంటి రాజకీయమే.
మోడీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన కేసీఆర్, కూతురు కల్వకుంట్ల కవిత కేసు విషయంలో వెనక్కు తగ్గి ఆమెను జైలు నుంచి విడిపించుకునేందుకే కేటీఆర్, హరీష్ రావులను ఢిల్లీకి పంపించి మోడీ, అమిత్ షాలతో రాజీకి ప్రయత్నించారు. ఆమె జైలు నుంచి తిరిగి రాగానే మళ్ళీ కేంద్రాన్ని విమర్శిస్తున్నారు. ఇది బిఆర్ఎస్ పార్టీ అవకాశవాదాన్నే సూచిస్తోంది కదా?
ఢిల్లీలో రైతులు ధర్నా చేస్తున్నప్పుడే కేసీఆర్ ఢిల్లీ వెళ్ళి వచ్చారు. కానీ అప్పుడు వారిని కలిసి సంఘీభావం తెలిపేందుకు ఇష్టపడలేదు. కానీ తన జాతీయ రాజకీయాలకు కాంగ్రెస్ మిత్ర పక్షాలు సహకరించకపోవడంతో, దేశంలో రైతుల అండతో దేశ రాజకీయాలలో చక్రం తిప్పుదామనే దూరాలోచనతో ఆ ధర్నా సమయంలో చనిపోయిన రైతుల కుటుంబాలకు డబ్బు పంచిపెట్టారు. ఇది బిఆర్ఎస్ పార్టీ అవకాశవాదానికి చక్కటి నిదర్శనమే కదా?
ఏపీలో జగన్ కూడా ఇదేవిదంగా కాస్త అయోమయం, కాస్త అవకాశవాదంతో వైసీపీని నడిపిస్తున్నారు. బీజేపితో పొత్తులు పెట్టుకోవడానికి భయపడే జగన్, మోడీ, అమిత్ షాల ఆశీర్వాదాలు కోరుకుంటారు. ఢిల్లీ ధర్నాలో తనకు సంఘీభావం తెలిపిన కాంగ్రెస్ మిత్రపక్షాలను కాదని, నిన్న పార్లమెంటులో జమిలి బిల్లుకి మద్దతు ఇవ్వడం కూడా వైసీపీ అవకాశవాదాన్నే సూచిస్తోంది. రాజకీయాలలో ఇటువంటి అవకాశవాదం సర్వసాధారణ విషయమే కానీ అదే పార్టీల విశ్వసనీయతని దెబ్బ తీస్తుందని వైసీపీ, బిఆర్ఎస్ పార్టీల ఓటములు నిరూపించాయి కదా?




