రెండు తెలుగు రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ తో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కానున్న భేటీ రాజకీయ వర్గాల్లో హాట్ హాట్ గా వినపడుతోంది. అకస్మాత్తుగా జరగనున్న ముఖ్యమంత్రి – గవర్నర్ భేటీపై పలు ఊహాగానాలు వినిపడుతున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రి వర్గ విస్తరణ చేపట్టనున్నట్టు వార్తలు వస్తున్న నేపధ్యంలో ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది.
కొత్తగా టీఆర్ఎస్ లో చేరిన వారికి మంత్రి వర్గంలో చోటు కల్పించడంతో పాటు ప్రస్తుతం క్రియాశీలంగా వ్యవహరించని మంత్రుల శాఖల్లో మార్పులు చేసేందుకు కేసీఆర్ నిర్ణయించినట్టు తెలుస్తోంది. అధికారం చేపట్టి రెండేళ్లు పూర్తయిన సందర్భంలో పలు మార్పులకు శ్రీకారం చుట్టనున్నట్టు సమాచారం. అందులో భాగంగా మంత్రి వర్గ విస్తరణ చేపట్టనున్నారు.
ఈ సారి మార్పుల్లో మహిళలకు భాగం కల్పించనున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు సన్నిహితులు, సీనియర్లతో కేసీఆర్ సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం. గవర్నర్ ను కలిసి అందుకు తగ్గ ముహూర్తం కోసం చర్చించనున్నట్టు ఊహాగానాలు కొనసాగుతున్నాయి.



