ఒక ఒరలో రెండు కత్తులు ఇమడవంటారు. కానీ తెలంగాణ సిఎం కేసీఆర్ ఒకటీ రెండూ కాదు పది కత్తులనైనా ఒకే ఒరలో ఇమడ్చగల నేర్పుగలవారు. ఇదివరకు ఓ వైపు మజ్లీస్ పార్టీతో, దానికి బద్దశత్రువైన మోడీతో ఏవిదంగా స్నేహం కొనసాగించారో అందరికీ తెలుసు.
ఇక తెలంగాణలో కాంగ్రెస్, బిజెపిల చేతే అవి తన బిఆర్ఎస్ పార్టీతో రహస్య అవగాహన కలిగి ఉన్నాయని పరస్పరం ఆరోపణలు చేయిస్తూ వాటి కళ్ళను వాటి వేళ్ళతోనే పొడుచుకొనేలా చేస్తూ వాటి విశ్వసనీయతను ప్రశ్నార్ధకంగా మార్చేశారు.
అంతేకాదు… రెండు జాతీయ పార్టీలలో ఒకటి రెండో దానికంటే ఏమాత్రం బలహీనపడినా లేదా మరొకటి బలపడుతున్నట్లు అనుమానం కలిగినా, బలహీనంగా ఉన్న పార్టీని జాకీ పెట్టి పైకి లేపుతూ, బలంగా ఉన్న పార్టీని అదిమిపడుతూ రెండింటినీ సమ ఉజ్జీలుగా ఆయనే బ్యాలన్స్ చేస్తూ, వాటిలో అవి కీచులాడుకొనేలా చేస్తుంటారు.
అందుకే తెలంగాణలో రెండు జాతీయ పార్టీలు ఉన్నప్పటికీ ప్రజలు కేసీఆర్ వైపే చూస్తుంటారని భావించవచ్చు.
కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో తెలంగాణలో కాంగ్రెస్ నేతలు, తెలంగాణలో మనమే అధికారంలోకి రాబోతున్నామనే నమ్మకం, ఆత్మవిశ్వాసంతో ఉరకలు వేస్తున్నారు. కనుక వారిని కత్తిరించి, బిజెపిని జాకీపెట్టి లేపాల్సిన అవసరం ఏర్పడింది. అందుకే గత కొన్ని రోజులుగా కేసీఆర్, మంత్రులు ఎవరూ మోడీ, బిజెపిల గురించి మాట్లాడకుండా, కాంగ్రెస్ వలన దేశానికి, తెలంగాణ రాష్ట్రానికి ఏవిదంగా నష్టం కలిగిందో గట్టిగా నొక్కి చెపుతున్నారు.
మంగళవారం నాగర్కర్నూల్ జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన కేసీఆర్, అక్కడ జరిగిన బహిరంగసభలో రాష్ట్రంలో కాంగ్రెస్ మళ్ళీ అధికారంలోకి వస్తే రైతులకు అష్టకష్టాలు మొదలవుతాయని, కనుక కాంగ్రెస్ పార్టీని బంగాళాఖాతంలో కలిపేయాలన్నారు. ఇదివరకు బిజెపి, మోడీలను విమర్శిస్తూ గంటలు గంటలు మాట్లాడే కేసీఆర్, ఈరోజు ప్రసంగంలో ఒక్కసారి కూడా ఆ ప్రస్తావన చేయకుండా, తన ప్రసంగాన్ని కాంగ్రెస్ పార్టీకే అంకితం ఇచ్చారు!
ఇప్పుడు బిజెపి మీద కేసీఆర్ ఒత్తిడి తగ్గించారు కనుక అది ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని పుంజుకొంటే, అప్పుడు కేసీఆర్ దానిని బంగాళాఖాతంలో కలిపేయలంటారు.
కేసీఆర్ ఈరోజు తన ప్రసంగంలో ఆంధ్రా పరిస్థితి గురించి రెండు ముక్కలు మాట్లాడారు. తెలంగాణ వస్తే రాష్ట్రం అంధకారం అయిపోతుందని భయపెట్టారని, కానీ ఇప్పుడు ఆంధ్రాలోనే అంధకారం అలుముకొందని, ఎక్కడ ఎప్పుడూ చూసినా ఏపీలో విద్యుత్ కోతలే అని కేసీఆర్ అన్నారు. జగనన్నా విన్నావా?ఏమంటావు?



