తెలంగాణ మంత్రులు, ఎమ్మెల్యేల పనితీరు, ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వచ్చే ఫలితాలపై సీఎం కేసీఆర్ స్వయంగా నిర్వహింపజేసిన సర్వేలో… కుమారుడు, ఐటీ, మునిసిపల్ మంత్రి, కేటీఆర్ కు కూడా ప్రజాదరణ తగ్గినట్టు వెల్లడైంది. గత సర్వేలో 70.6 శాతంగా ఉన్న కేటీఆర్ పై ప్రజాదరణ ఇప్పుడు 60.4 శాతానికి దిగజారినట్లుగా తేలింది. ఇదే సమయంలో గడచిన ఆరు నెలల వ్యవధిలో పలువురు మంత్రుల గ్రాఫ్ కూడా తగ్గినట్లుగా తెలుస్తోంది.
తొలి సర్వేలో 80.4 శాతం ఆదరణ చూరగొన్న తలసాని శ్రీనివాస్ యాదవ్ కు మలి సర్వేలో 57.5 శాతం ఆదరణ మాత్రమే ఉన్నట్టు తేలింది. అలాగే ఇతర మంత్రులకు ప్రజాదరణ గ్రాఫ్ లలో జగదీశ్ రెడ్డి 94.3 శాతం నుంచి 45.4 శాతానికి, జోగు రామన్న 67.5 శాతం నుంచి 39.9 శాతానికి, చందూలాల్ 82.4 శాతం నుంచి 34.4 శాతానికి, పట్నం మహేందర్ రెడ్డి 68.5 శాతం నుంచి 38.3 శాతానికి, ఇంద్రకరణ్ రెడ్డి 96 శాతం నుంచి 58.4 శాతానికి, తుమ్మల నాగేశ్వరరావు 82.1 శాతం నుంచి 57.5 శాతానికి, జూపల్లి కృష్ణారావు 62.5 శాతం నుంచి 55.2 శాతానికి పడిపోయింది.
ఈ సర్వే టీఆర్ఎస్ శ్రేణులను కలవరపెడుతుండగా, తదుపరి సర్వే నాటికి ప్రజాదరణను పెంచుకోకుంటే, 2019 ఎన్నికల్లో టికెట్లను ఇవ్వబోమని కేసీఆర్ హెచ్చరించినట్టు సమాచారం. అయితే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల విజయంలో కీలక పాత్ర పోషించారని చెప్పుకున్న కేటీఆర్ గ్రాఫ్ కూడా దారుణంగా పడిపోవడానికి గల కారణాలు అన్వేషించే పనిలో పడ్డారట కేసీఆర్. తన తర్వాత వారసుడిగా ముఖ్యమంత్రి పీఠం అధిష్టించాల్సిన కేటీఆర్ గ్రాఫ్ పడిపోవడం అనేది, హరీష్ రావు లాంటి వారికి ఊతమిచ్చినట్లేనన్న చర్చ పొలిటికల్ వర్గాల్లో జరుగుతోంది.



