
దాదాపు ఏడాదిన్నర అజ్ఞాతవాసం ముగించుకొని తెలంగాణ మాజీ సిఎం కేసీఆర్ రేపటి నుంచి శాసనసభ బడ్జెట్ సమావేశాలకు హాజరుకాబోతున్నారు. ఈ విషయం ఆయన కుమారుడు, బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్వయంగా చెప్పారు.
ఈరోజు మద్యాహ్నం ఒంటి గంటకు కేసీఆర్ పార్టీ ప్రధాన కార్యాలయం తెలంగాణ భవన్కు వచ్చి పార్టీ శాసనసభాపక్ష సమావేశం నిర్వహించి ఎమ్మెల్యేలకు దిశ నిర్దేశం చేశారు. రేపటి నుంచి ప్రారంభం కాబోయే బడ్జెట్ సమావేశాలలో ఎస్సీ వర్గీకరణ, బీసీలకు 42 శాతం రిజర్వేషన్స్ ప్రతిపాదన, ఏపీ ప్రభుత్వం చేపట్టబోతున్న బనకచర్ల ప్రాజెక్ట్ ద్వారా ఏపీ ప్రభుత్వం గోదావరి నీళ్ళని తరలించుకుపోతుండటం, సాగునీరు అందక రాష్ట్ర రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలు తదితర అంశాల గురించి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కేసీఆర్ శాసనసభలో నిలదీయబోతున్నారు.
Also Read – కోటరీ రియాక్షన్ లేదేమిటి?
కేసీఆర్ తెలంగాణ భవన్కు వస్తేనే ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు ఉత్సాహంతో పొంగిపోతారు. ఇక శాసనసభ సమావేశాలలో పాల్గొని రేవంత్ ప్రభుత్వాన్ని చీల్చి చెండాడుతుంటే సంతోషించకుండా ఉంటారా?ఏప్రిల్ 27న బిఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వరంగల్లో భారీ బహిరంగ సభ నిర్వహించాలని కేసీఆర్ నిర్ణయించారు. కనుక బిఆర్ఎస్ పార్టీ మళ్ళీ యాక్టివ్ అయిన్నట్లే.. ఇంతకాలం కేసీఆర్ లేకపోవడం వలన బిఆర్ఎస్ పార్టీ నేతలతో కబాడీ ఆడుకుంటున్న తెలంగాణ కాంగ్రెస్ నేతలకు అగ్నిపరీక్ష మొదలైన్నట్లే!
ఒకవేళ రేవంత్ పాలన కేసీఆర్ పాలన కంటే ఏ మాత్రం మెరుగ్గా ఉన్నా రేపు కేసీఆర్ రాక వలన కాంగ్రెస్ నేతలకు పెద్దగా ఇబ్బంది ఉండేది కాదు. కానీ 15 నెలల కాంగ్రెస్ పాలనలో ప్రతీ రంగంలో సమస్యలు పేరుకుపోయి సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కనుక కేసీఆర్ రాక కాంగ్రెస్ పార్టీకి, ప్రభుత్వానికి, ముఖ్యంగా సిఎం రేవంత్ రెడ్డికి, మంత్రులకు అగ్నిపరీక్షగానే మారవచ్చు.