బిర్యానీ అప్పుడప్పుడు తింటే అద్భుతంగా అనిపిస్తుంది కానీ రోజూ తినమంటే వెగటు పుడుతుంది. తెలంగాణ సిఎం కేసీఆర్ మొదటి నాలుగేళ్ళు అభివృద్ధి, సంక్షేమ పధకాలను సమాంతరంగా కొనసాగిస్తూ, ఎన్నికలకు ముందు మాత్రమే కొత్త పధకాలు, అన్ని వర్గాలకు వరాలు ప్రకటిస్తుంటారు.
దేశంలో దాదాపు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఇదే పద్దతిని అనుసరిస్తుంటాయి. కానీ ఏపీలో వైసీపీ ప్రభుత్వం మాత్రం 5 ఏళ్ళపాటు ప్రతీరోజూ అందరికీ బిర్యానీ తినిపిస్తూ వెగటు పుట్టేలా చేసింది.
ఎన్నికలకు ముందు వరాలు ప్రకటిస్తే దాని ఎఫెక్ట్ చాలా ఎక్కువే ఉంటుంది. ఇందుకు తాజా ఉదాహరణగా టీఎస్ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి, దానిలో పనిచేస్తున్న 43,373 మందిని ప్రభుత్వోద్యోగులుగా తీసుకోబోతున్నట్లు కేసీఆర్ నిన్న ప్రకటించారు. దీంతో వారు వారి కుటుంబాల ఓట్లన్నీ గంపగుత్తగా బిఆర్ఎస్కి పడిపోతాయని వేరే చెప్పక్కరలేదు.
నిజానికి జగన్ ప్రభుత్వం ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేసినప్పుడే, తెలంగాణ ప్రభుత్వం కూడా చేసి ఉండవచ్చు. కానీ అప్పటికి కేసీఆర్ ప్రభుత్వానికి రాష్ట్రంలో చాలా సానుకూల వాతావరణం ఉంది. కనుక తొందరపడకుండా ఇన్నేళ్ళు విలీనంలోని సాదకబాధకాలను నిశితంగా పరిశీలించారు.
ఈసారి రాష్ట్రంలో బిఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్, బిజెపిల నుంచి గట్టి పోటీ ఉంటుందని కనుక, ఏటికి ఎదురీదవలసి ఉంటుందని గుర్తించిన కేసీఆర్ ఇప్పుడు ఈ విలీనమనే బ్రహ్మాస్త్రాన్ని బయటకు తీసి ప్రతిపక్షాలపైకి సందించారు.
కేసీఆర్ మరో దివ్యాస్త్రాన్ని కూడా ఇంతకాలం వినియోగించకుండా జమ్మిచెట్టు మీద భద్రంగా దాచిపెట్టి ఉంచారు. అదే… మైనార్టీ బంధు! ఇంతకాలం మజ్లీస్ పార్టీతో దోస్తీ బాగానే సాగింది కనుక దాని అవసరం పడలేదు. కానీ ఇప్పుడు మజ్లీస్ పార్టీ తోక జాడిస్తుండటంతో కేసీఆర్ ఆ అస్త్రాన్ని తీసి ప్రయోగించబోతున్నారు!
ఇక ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తొలిరోజు నుంచే ప్రజలకు ‘సంక్షేమ బిర్యానీ’ తినిపించడం మొదలుపెట్టింది. అయితే అదేమీ తిరుపతి లడ్డూ ప్రసాదం కాదు… దశాబ్ధాలు గడిచినా ఒకే రుచి, అదే నాణ్యత కలిగి ఉండేందుకు!
జగన్ ప్రభుత్వం అప్పు చేసి పప్పు కూడు తినిపిస్తున్నట్లు సంక్షేమ పధకాలు అమలుచేస్తోంది. కూర్చొని తింటుంటే కొండలైనా కరిగిపోతాయి. అప్పుల భారం పెరిగిపోతుండటంతో నిబందనల పేరుతో లబ్ధిదారులను తగ్గించుకొంది. వారికి ఇచ్చే ఆ సొమ్ములో మళ్ళీ ఏదో వంకతో కొంత కోసుకొంటోంది.
ఇంకా భారం తగ్గించుకోవడానికి తరచూ పన్నులు, ఛార్జీలు పెంచుతూ వారిపై కూడా ఆ భారం వేస్తుండటంతో వారిలో కూడా అసంతృప్తి పెరిగిపోయింది. అందుకే మంత్రులు, ఎమ్మెల్యేలు గడప గడపకి వెళ్ళేందుకు జంకుతుండటం అందరూ చూస్తూనే ఉన్నారు.
గత 4 ఏళ్లుగా అమలుచేస్తున్న సంక్షేమ పధకాలన్నీ పాతబడిపోయాయి. చప్పబడిపోయాయి. అలాగని ప్రజలను ప్రసన్నం చేసుకొనేందుకు ఇప్పుడు జగన్ కొత్తగా మరిన్ని సంక్షేమ పధకాలను ప్రకటించే పరిస్థితి లేనేలేరు.
అందుకే ఇప్పుడు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు మొదలుపెట్టిన్నట్లున్నారు. వాటిని ఎలాగూ ఇప్పుడు మొదలుపెట్టక్కరలేదు పూర్తి చేయక్కరలేదు కూడా. కనుక నిధులు కేటాయించక్కరలేదు కూడా. జస్ట్ శిలాఫలకాలు వేస్తే చాలు! కనుక వేసుకుపోతున్నారు. ఓవర్ ఆల్గా చూస్తే తెలంగాణ ప్రభుత్వం అభివృద్ధిపనులు పూర్తిచేసి చూపిస్తుంటే, ఏపీ ప్రభుత్వం ఇంకా శంకుస్థాపనల దశలోనే ఉంది.
కేసీఆర్-జగన్ ఇద్దరి లక్ష్యం ఎన్నికలలో గెలిచి మళ్ళీ అధికారంలోకి రావడమే. కానీ అందుకు కేసీఆర్ ఎంచుకొన్న ‘అభివృద్ధి మార్గం’ సత్ఫలితాలు ఇచ్చే అవకాశం కనిపిస్తుంటే, నాలుగేళ్ళుగా లబ్ధిదారులకు బిర్యానీ తినిపిస్తున్నా మళ్ళీ గెలుస్తామని ఖచ్చితంగా చెప్పలేని పరిస్థితిలో ఉంది జగన్ ప్రభుత్వం.



