తెలంగాణ మాజీ సిఎం కేసీఆర్ దాదాపు 14 నెలల అజ్ఞాతవాసం నేటితో ముగించుకొని మళ్ళీ రాజకీయాలలో యాక్టివ్ కాబోతున్నారు. ఈరోజు మద్యాహ్నం ఒంటి గంట నుంచి తెలంగాణ భవన్లో బిఆర్ఎస్ పార్టీ విస్తృతస్తాయి సమావేశం జరుగుతుంది.
దానిలో ఆయన పార్టీ నేతలకు దిశా నిర్దేశం చేస్తారు… అని అ పార్టీ నేతలు చెప్పుకుంటున్నారు. కానీ దిశా నిర్దేశం అంటే తన ప్రభుత్వం, పాలన గొప్పదనం గురించి చెప్పుకున్నాక, రేవంత్ రెడ్డి పాలనపై విమర్శలతో సరిపెడతారని అందరికీ తెలుసు.
ఏది ఏమైనప్పటికీ మళ్ళీ చాలా కాలం తర్వాత కేసీఆర్ పార్టీ శ్రేణులకు అందుబాటులోకి వస్తున్నందున వారిలో కొత్త ఉత్సాహం మొదలవుతుంది.
ఒకవేళ ఆయన మళ్ళీ ఫామ్హౌస్లోకి వెళ్ళిపోకుండా తరచూ పార్టీ కార్యాలయానికి వచ్చి ప్రెస్మీట్లు పెట్టినా తెలంగాణ రాజకీయాలలో వేడి పెరుగుతుంది.
ఈ 15 నెలల్లో తెలంగాణలో బీజేపి పుంజుకునే అవకాశం లభించింది. కానీ బీజేపి ఈ అవకాశాన్ని చేజార్చుకుంది. ఒకవేళ కేసీఆర్ మళ్ళీ ఇదివరకులా పూర్తి స్థాయిలో యాక్టివ్గా అయితే, బిఆర్ఎస్ పార్టీ మళ్ళీ రెండో స్థానంలోకి వస్తుంది. కనుక అప్పుడు రెండో స్థానం కొరకు రెండు పార్టీలు పోటీ పడాల్సి వస్తుంది.
కానీ రెండు పార్టీలకు కాంగ్రెస్ పార్టీయే శత్రువు కనుక తెర వెనుక అవి చేతులు కలిపితే రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ప్రమాదం పొంచి ఉన్నట్లే!
ఏడు పదుల వయసులో కేసీఆర్ మళ్ళీ ప్రజలు, పార్టీ శ్రేణుల మద్యకు వస్తున్నారు. కానీ వైసీపీలో ఆరడుగుల అందగాడు, నవ యువకుడైన జగన్ పరామర్శలకు మాత్రమే బయటకు వస్తున్నారు.
ఆయన ప్యాలస్ నుంచి బయటకు రావాలంటే ఎక్కడైనా శవాలు లేవాలి.. అత్యాచారాలు జరగాలి.. లేదా వైసీపీ నేతలు ఎవరైనా జైలుకి వెళ్ళాలన్నట్లు రాజకీయాలు చేస్తున్నారు.
రాష్ట్రంలో మెల్లగా ఎండలు, ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. కనుక అవి తగ్గాక ప్యాలస్ నుంచి జగన్ బయటకు వస్తారేమో?





