ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో సంచలనంగా మారిన లిక్కర్ స్కాం కేసులో నేడు మరోకీలక ఘటన తెరమీదకొచ్చింది. ఈ కేసులో విచారణకు హాజరు కావాలంటూ ఈడీ అధికారులు విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని చిన్ని సతీమణి కేశినేని జానకి లక్ష్మికి నోటీసులు జారీ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
ఈ నెల 27 న ఢిల్లీలోని ఈడీ ప్రధాన కార్యలయంలో విచారణకు హాజరుకావాలంటూ అధికారులు కేశినేని జానకి లక్ష్మి కి సమన్లు జారీచేసినట్లుగా కథనాలు ప్రచారంలోకి వచ్చాయి. అయితే ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఇప్పటికి వైసీపీ పార్టీకి సంబంధించిన పలువురు నేతలు, జగన్ సన్నిహితులు అరెస్టయ్యి జైల్లో ఉన్నారు, మరికొందరు బైళ్ళ బయట తిరుగుతున్నారు.
లిక్కర్ స్కాం కేసులో A1 గా ఉన్న రాజ్ కసిరెడ్డి తో జానకి లక్ష్మికి వ్యాపార సంబంధాలు ఉండడం, అలాగే ‘ప్రైడ్ ఇన్ ఫ్రాకాన్’ ఎల్ఎల్పి కంపెనీతో సాగిన అనుమానిత ఆర్థిక లావాదేవీల మీద ఈడీ అధికారులు ఆరా తీయడంతో కేశినేని జానకి పేరు వెలుగులోకి వచ్చినట్టు వార్తలు వినిపిస్తున్నాయి.
అయితే ఈ కేసు విచారణ కోసం గతంలోనే జానకి లక్ష్మికి అధికారులు నోటీసులు ఇచ్చినప్పటికీ నేడు మరోసారి ఆమె పేరు తెరమీదకు రావడం, ఆమెకు విచారణకు హాజరుకాలంటూ సమన్లు జారీ చేయడం వంటి వార్తలు ప్రచారంలోకి రావడంతో విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని స్పందించారు.
తన భార్య జానకి లక్ష్మి కి లిక్కర్ కేసులో ఈడీ అధికారులు నోటీసులు ఇచ్చారు అన్న వార్తలు అవాస్తవమంటూ ఆ వార్తలను ఖండించారు. అలాగే ఇశ్వాని, కేశినేని డెవలపర్స్ కలిసి నిర్వహించిన రియల్ ఎస్టేట్ సంస్థ ప్రైడ్ ఇన్ఫ్రా సంస్థకు ఈడీ నోటీసులు ఇచ్చిందని,
ఆ కంపెనీ తరుపున వచ్చిన నోటీసులను తన భార్య పేరు మీద వచ్చిన నోటీసులుగా చిత్రీకరిస్తున్నారని స్పష్టత ఇచ్చారు చిన్ని. 2021 లో రాజ్ కసిరెడ్డి సంబంధించిన ఇశ్వాని సంస్థతో కలిసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేందుకు కేశినేని కి సంబంధించిన ప్రైడ్ ఇన్ఫ్రా సంస్థను ఏర్పాటు చెయడం జరిగిందని,
ఆ సంస్థ ద్వారా 35 లక్షలకు సంబంధించిన ఆర్థిక లావాదేవీలు జరిగాయని, తరువాత రాజ్ కసిరెడ్డి నిర్వాకం తెలియడంతో ఆ కంపెనీ నుంచి పక్కకు తప్పుకున్నామంటూ కేశినేని చిన్ని వివరణ ఇచ్చారు. గతంలో ఆ కంపెనీ ద్వారా జరిగిన ఆర్థిక లావాదేవీల విషయంలో సంస్థ తరుపున సమాధానం కోరుతూ ఈడీ అధికారులు విచారణకు నోటీసులు ఇచ్చారన్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్ లపై చేస్తున్నట్టుగానే తన పైన తన కుటుంబ సభ్యల పైన కూడా బ్లూ ఆరోపణలు షురూ అయ్యాయంటూ కేశినేని శివనాథ్(చిన్ని) తన భార్యకు లిక్కర్ కేసులో ఈడీ నోటీసులు అనే వార్తలను పూర్తిగా ఖండించారు.




