విజయవాడ టిడిపి ఎంపీ కేశినేని నాని తన ఎంపీ పదవికి, టిడిపి ప్రాధమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేయబోతున్నట్లు ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. టిడిపికి తన అవసరం లేదని చంద్రబాబు నాయుడు చెప్పిన తర్వాత ఇంకా పార్టీలో కొనసాగడం అనవసరమని భావిస్తున్నానని కనుక త్వరలో లోక్సభ స్పీకర్ని కలిసి తన రాజీనామా లేఖను సమర్పిస్తానని, టిడిపికి కూడా రాజీనామా చేయబోతున్నట్లు కేశినేని నాని ట్వీట్ చేశారు.
టిడిపిలో చాలా సీనియర్ నాయకుడు అయిన కేశినేని నానికి బదులు ఆయన తమ్ముడు కేశినేని చిన్నికి ఈసారి టికెట్ ఇవ్వబోతున్నట్లు చంద్రబాబు నాయుడు చాలా కాలం క్రితమే సూచించారు. కనుక ఇదేదో రాత్రికి రాత్రి తీసుకొన్న నిర్ణయం కాదని కేశినేని నానికి కూడా తెలుసు.
అయితే సరిగ్గా శాసనసభ, లోక్సభ ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు ఈ విషయం స్పష్టం చేయడం వలన ఆయన అహం దెబ్బతిని ఉండవచ్చు. అందుకే పార్టీకి, ఎంపీ పదవికి రాజీనామా చేసేందుకు సిద్దపడుతున్నారని అనుకోవచ్చు.
టిడిపిని వీడుతున్నట్లు స్వయంగా చెప్పేసారు కనుక ఇప్పుడు ఆయన ఏమి చేయబోతున్నారు? ఆయన కూడా వల్లభనేని వంశీ, కొడాలి నానిలా వైసీపిలో చేరుతారా? లేక కొత్త ప్రత్యామ్నాయంగా వస్తున్న కాంగ్రెస్ పార్టీలో చేరుతారా లేక రాజకీయాలకు స్వస్తి చెప్పి తన వ్యాపారాలు చూసుకొంటారా?అనే ప్రశ్నలకు త్వరలో ఆయనే సమాధానం చెప్తారు.
చంద్రబాబు నాయుడు గారు పార్టీ కి నా అవసరం లేదు అని భావించిన తరువాత కుడా నేను పార్టీలో కొనసాగటం కరెక్ట్ కాదు అని నా భావన
కాబట్టి త్వరలోనే ఢిల్లీ వెళ్లి లోకసభ స్పీకర్ గారిని కలసి నా లోకసభ సభ్యత్వానికి రాజీనామా చేసి ఆ మరుక్షణం పార్టీకి రాజీనామా చేస్తానని అందరికీ తెలియ చేస్తన్నాను . pic.twitter.com/dFq85E4SxG— Kesineni Nani (@kesineni_nani) January 5, 2024




