ఆంధ్రప్రదేశ్ టిడిపి అధ్యక్షుడు అచ్చెన్నాయుడు సిఎం జగన్, మంత్రుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళిలో మీడియాతో మాట్లాడుతూ, “రాష్ట్ర విభజన తర్వాత ప్రభుత్వం చేతిలో చిల్లిగవ్వ లేకపోవడంతో చంద్రబాబు నాయుడు రైతులను ఒప్పించి ఒక్క రూపాయి ఖర్చు పెట్టకుండా అమరావతి కోసం 36,000 ఎకరాలను సేకరించారు. ఏమాత్రం శ్రమలేకుండా చేతికందిన ఆ భూములలో రాజధాని నిర్మాణం చేయడానికి అవకాశం ఉన్నప్పటికీ సిఎం జగన్మోహన్ రెడ్డి వడ్డించిన విస్తరిలో ఉమ్మేసినట్లు, అమరావతిని కాలరాసి, మూడు రాజధానులు అంటూ ఇప్పటికే రాష్ట్ర విభజనతో చితికిపోయున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పూర్తిగా భ్రష్టు పట్టించేశారు.
ఇప్పుడు మీ రాజధాని ఏది అని ఎవరైనా అడిగితే ప్రజలు సమాధానం చెప్పలేని స్థితిలో ఉన్నారు. ఆవు చేలో మేస్తుంటే దూడ గట్టున మేస్తుందా? అందుకే మంత్రులు కూడా పాదయాత్ర చేస్తున్న రైతులను ఉద్దేశ్యించి నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారు. మూడు రాజధానులతో రాష్ట్రంలో అన్ని జిల్లాలు అభివృద్ధి చెందుతాయని వాదిస్తున్న మంత్రులు, ఎమ్మెల్యేలు ఈ మూడేళ్ళలో రాష్ట్రంలో ఒక్క ఊరుని అభివృద్ధి చేశారా?అని అడుగుతున్నాను. మూడేళ్ళుగా చేయని పనిని మూడు రాజధానులు వస్తే ఎలా చేస్తారు? రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలంటే మూడు రాజధానులు అక్కర్లేదు… ప్రభుత్వానికి తపన, చిత్తశుద్ది ఉంటే చాలు.
కానీ వైసీపీ నేతల దృష్టి ఎప్పుడూ భూముల కబ్జాలపైనే ఉంటుంది. కనుకనే కొండలు, గుట్టలు కూడా విడిచిపెట్టకుండా దోచేస్తున్నారు. సిఎం జగన్మోహన్ రెడ్డికి ప్రజలు ఒక్క ఛాన్స్ ఇచ్చిన పాపానికి రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నాడు. అమరావతి రైతులను మంత్రులే బెదిరిస్తుండటం చాలా బాధాకరం. వారికి ప్రజలే తగినవిదంగా బుద్ధి చెపుతారు. అరసవిల్లికి వస్తున్న రైతులను సాదరంగా ఆహ్వానిద్దాం. వారితో కలిసి పోరాడి అమరావతిని సాధించుకొందాం,” అని అన్నారు.



