ఇటీవల కేంద్ర హోం మంత్రి అమిత్ షా హైదరాబాద్ వచ్చినప్పుడు ప్రముఖ నటుడు జూ.ఎన్టీఆర్తో, ఈనాడూ గ్రూప్ ఛైర్మన్ రామోజీరావుతో భేటీ అయ్యారు. అప్పుడు లక్ష్మీ పార్వతి, మాజీ మంత్రి కొడాలి నాని, మంత్రి రోజా ముగ్గురూ అమిత్ షా- రామోజీరావుతో ఎందుకు భేటీ అయ్యారో మాట్లాడలేదు. కానీ జూ.ఎన్టీఆర్తో ఎందుకు భేటీ అయ్యారో తమ అధినేత జగన్మోహన్ రెడ్డికి సంతృప్తి, సంతోషం కలిగేలా మాట్లాడారు. రామోజీరావుతో అమిత్ షా భేటీ గురించి ఎందుకు మాట్లాడలేదంటే అది తమ ప్రభుత్వానికి ఎసరు పెట్టేందుకే అని వారికీ బాగా తెలుసు కనుక!
జూ.ఎన్టీఆర్ టిడిపిని స్వాధీనం చేసుకొంటారని, అప్పుడు చంద్రబాబు నాయుడు కొత్త పార్టీ పెట్టుకోవలసి వస్తుందని కొడాలి నాని చెప్పడం పైశాచిక ఆనందం కోసమే. నేడు హైదరాబాద్ వచ్చిన బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా మరో ప్రముఖ నటుడు నితిన్, ప్రముఖ మహిళా క్రికెటర్ మిథాలీ రాజ్తో భేటీ కానున్నారు. కనుక మళ్ళీ కొడాలి వారికి, రోజమ్మకు పని పడిందని చెప్పవచ్చు.
బిజెపి సాయంతో నితిన్, మిథాలీ రాజ్ తెలంగాణలో టిఆర్ఎస్ పార్టీని స్వాధీనం చేసుకొంటారని, కేసీఆర్ కొత్త పార్టీ పెట్టుకొంటారని కొడాలివారు చెపుతారా! ఏమో చెప్పినా ఆశ్చర్యపోనక్కరలేదు. ఎందుకంటే అక్కడ తెలంగాణలో చెల్లెమ్మ వైఎస్ షర్మిలకు కూడా ఆనందం కలిగించాలనుకొంటే చెప్పినా చెప్పవచ్చు.
ఈరోజు జేపీ నడ్డా నితిన్, మిథాలీ రాజ్తో భేటీతో ఓ విషయం స్పష్టం అవుతోంది. వచ్చే ఎన్నికలలో బిజెపి వారందరినీ ఎన్నికల ప్రచారంలో వినియోగించుకోవాలని భావిస్తోందని అర్దమవుతోంది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలలో వారి సేవలను బిజేపీ ఉపయోగించుకోవాలనుకొంటున్నప్పటికీ, దాని వలన వారికి జగన్, కేసీఆర్ ప్రభుత్వాల నుంచి సమస్యలు ఎదుర్కోవలసి ఉంటుంది కనుక వారు అంగీకరించకపోవచ్చు. అలాగని బిజెపిని కాదన్నా ఐటి సమస్యలు పుట్టుకువచ్చే ప్రమాదం ఉంటుంది. కనుక ఇతర రాష్ట్రాలలో తెలుగు ప్రజలు ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో ప్రచారానికి అంగీకరించవచ్చు.
Nithin meets BJP President JP Nadda pic.twitter.com/pECfM83Q89
— M9 NEWS (@M9News_) August 27, 2022



