కూటమి ప్రభుత్వ మెతక వైఖరే వైసీపీకి శ్రీరామరక్ష

Konakalla Narayana Rao Gouthu Sireesha Kolusu Partha Sarathy

జగన్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడుతో సహా టీడీపీ ముఖ్య నేతలందరినీ లక్ష్యంగా చేసుకొని తప్పుడు కేసులు నమోదు చేసి వేధించారు. జైళ్ళకు కూడా పంపించారు.

కనుక కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే తమపై ప్రతీకారచర్యలు మొదలుపెడుతుందని వైసీపీ నేతలందరూ భయపడ్డారు. ఆ భయంతోనే కొందరు రాజకీయ సన్యాసం ప్రకటించగా కొందరు టీడీపీ, జనసేనలలో చేరిపోయారు. ఆ భయంతోనే జగన్‌ ఢిల్లీలో ధర్నా చేశారు కూడా.

ADVERTISEMENT

కానీ సిఎం చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్‌, నారా లోకేష్‌ అందరూ పాలన, అభివృద్ధిపైనే ఎక్కువ దృష్టి పెడుతుండటంతో, జగన్‌తో వైసీపీ నేతలందరికీ ధైర్యం వచ్చేసింది. ఆ ధైర్యంతోనే మళ్ళీ వారు చంద్రబాబు నాయుడుని లక్ష్యంగా చేసుకొని విమర్శలు, ఆరోపణలు చేస్తున్నారు. ఆ ధైర్యంతోనే కాకినాడ పోర్టు నుంచి యధేచ్చగా రేషన్ బియ్యం విదేశాలకు అక్రమ రవాణా చేశారని చెప్పొచ్చు.

వైసీపీ పట్ల సిఎం చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్‌లు మెతక వైఖరి ప్రదర్శిస్తుండటంతో టీడీపీ, జనసేన నేతలు కూడా వైసీపీ హయంలో జరిగిన అవమానాలన్నీ దిగమింగుకొని మౌనంగా ఉండిపోక తప్పడం లేదు.

మంత్రి కొలుసు పార్ధసారధి, పలసా టీడీపీ ఎమ్మెల్యే గౌతు శిరీష, ఏపీఎస్ ఆర్టీసీ ఛైర్మన్‌ కొనకళ్ళ సత్యనారాయణ ముగ్గురూ కూడా నిన్న నూజివీడులో గౌతు లచ్చన్న విగ్రహావిష్కరణ కార్యక్రమంలో మాజీ మంత్రి జోగి రమేష్ తో రాసుకుపూసుకు తిరిగారు.

సోషల్ మీడియాలో వారి చర్యలను తప్పు పడుతూ విమర్శలు వచ్చే వరకు కూటమి ప్రభుత్వంలో ఎవరూ స్పందించకపోవడం విస్మయం కలిగిస్తుంది. చివరికి మంత్రి నారా లోకేష్‌ వారికి వార్నింగ్ ఇచ్చి వివరణ కోరారు.

ఇక మాజీ మంత్రి పేర్ని నాని కుటుంబానికి చెందిన గోదాములలో నుంచి 3,708 బస్టాల బియ్యం మాయం అయ్యిందనే విషయం ఆయన స్వయంగా బయటపెట్టే వరకు పౌరసరఫరా శాఖ అధికారులకు ఎవరికీ తెలియదంటే నమ్మశక్యంగా లేదు. వారి మౌనానికీ టీడీపీ, జనసేన నేతలే కారణం అవడం దిగ్బ్రాంతి కలిగిస్తుంది.

కాకినాడ పోర్టు నుంచి బియ్యం అక్రమ రవాణా అవుతోందంటూ చాలా హడావుడి చేసిన మంత్రి మంత్రి నాదెండ్ల మనోహర్‌, జిల్లాలో టీడీపీ, జనసేన నేతలందరూ పేర్ని నాని గోదాముల నుంచి బియ్యం మాయం అవడంపై నేటికీ నోరు విప్పడం లేదు. పేర్ని నాని విషయంలో వారి మౌనం ఆలోచింపజేస్తుంది. ఆయనని జనసేనలో చేర్చుకోవాలని భావిస్తున్నారా?అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.

వైసీపీ పట్ల కూటమి ప్రభుత్వంలో మంత్రుల తీరు ఈవిదంగా ఉండటంతో పేర్ని నాని విషయంలో పౌరసరఫరా శాఖ అధికారులు కూడా మౌనం వహించారనే విమర్శలు వినిపిస్తున్నాయి. కనుక శాసనసభలో చంద్రబాబు నాయుడుని అవమానించిన కొడాలి నాని, రోజా, అంబటి రాంబాబు, జోగి రమేష్ తదితరులను కూడా క్షమించేసి టీడీపీ, జనసేనలలో చేర్చేసుకుంటే ఓ పనైపోతుందని నెటిజన్స్ వ్యంగ్యంగా సూచిస్తున్నారు.

ADVERTISEMENT
Latest Stories