‘భరత్ అనే నేను’ సినిమా టీజర్ లో మహేష్ చెప్పిన ‘ప్రామిస్’ డైలాగ్ ప్రతి ఒక్కరికి ఓ స్థాయిలో కనెక్ట్ అయిన విషయం తెలిసిందే. ముఖ్యంగా వర్తమాన రాజకీయాలకు సదరు ‘ప్రామిస్’ డైలాగ్ నూటికి నూరు శాతం సరిపోయింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ‘ప్రత్యేక హోదా’ విషయంలో నరేంద్ర మోడీ సర్కార్ అవలంభించిన విధానంపై తెలంగాణా సర్కార్ నుండి కూడా సానుకూల స్పందన వచ్చిందంటే… ఏ స్థాయిలో ఏపీని తమ రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకున్నారో అర్ధం చేసుకోవచ్చు.
‘ఒకసారి ప్రామిస్ చేసి, ఆ మాట తప్పితే… యు ఆర్ నాట్ కాల్డ్ ఎ మ్యాన్’ అంటూ మహేష్ చెప్పిన డైలాగ్ ను పరోక్షంగా కొరటాల శివ, తన ట్వీట్ ద్వారా మరోసారి గుర్తు చేసారు. ఆంధ్రప్రదేశ్ కు మోడీ ఇచ్చిన ‘ప్రామిస్’ను నిలబెట్టుకుని మనిషిగా మారేలా మనమంతా ప్రయత్నించాలని కొరటాల శివ చేసిన ట్వీట్ నెటిజన్ల నుండి మాంచి స్పందన లభిస్తోంది. “రెండు తెలుగు రాష్ట్రాలు ఇండియాలో ఉన్నాయని మీరు నిజంగా ఫీల్ అవుతున్నారా?” అంటూ ఓ ప్రశ్న కూడా కొరటాల ఈ సందర్భంగా సంధించారు.
ఒక్క కొరటాల చేసిన ఈ ట్వీట్ కు ప్రతిస్పందించిన నెటిజన్లు, ఇంకా మోడీ ఏపీకి ఏమేం ప్రామిస్ లు చేసారో, వాటిని ఎలా గంగపాలు చేసారో కూడా సవివరంగా తెలుపుతున్నారు. మాట నిలబెట్టుకోలేని మోడీని ఏమనాలి? మీ నుండి ఊహించని ట్వీట్ ఇది! ఇంకా అడగండి… మోడీని కడిగేయండి..! అంటూ పలు పలు విధాలుగా నెటిజన్లు కొరటాల ట్వీట్ కు ప్రతిస్పందిస్తూ తమ తమ అనుభూతులను పంచుకుంటున్నారు. చూడబోతుంటే ‘భరత్ అనే నేను’ ప్రామిస్ డైలాగ్ టాక్ ఆఫ్ ఇండియన్ పోలిటిక్స్ లో ఓ రేంజ్ లో హల్చల్ చేసేలా కనపడుతోంది.
Let’s all make @narendramodi ji a MAN by reminding his promise to Andhra Pradesh. Do u honestly feel that telugu states are a part of India sir?
— koratala siva (@sivakoratala) March 7, 2018



