నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వైసీపీలో ఉన్నప్పుడే తన నియోజకవర్గంలో చిన్నచిన్న పనులకు కూడా నిధులు మంజూరు చేయడం లేదంటూ మురికి కాలువలో నిలబడి నిరసన తెలిపారు.
తన నియోజకవర్గంలో చిన్న చిన్న అభివృద్ధి పనులకు నిధులు కేటాయించకపోగా, తన ఫోన్ ట్యాపింగ్ చేయించడంతో తీవ్ర ఆగ్రహంతో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఎన్నికలకు ఇంకా 15 నెలల సమయం ఉండగానే వైసీపీకి రాజీనామా చేసి బయటకు వచ్చేశారు.
ఆ తర్వాత ఎన్నికలకు ముందు టీడీపీలో చేరి మళ్ళీ అదే నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలిచారు. వైసీపీలో ఉండగా చేయలేకపోయిన పనులన్నీ ఇప్పుడు వరుసపెట్టి పూర్తి చేయిస్తున్నారు.
ఇవాళ్ళ (ఆదివారం) ఒక్కరోజే తన నియోజకవర్గంలో 105 అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసి సరికొత్త రికార్డ్ సృష్టించారు. శంకుస్థాపనలు చేసి ప్రజలను మభ్యపెట్టబోవడం లేదని, ఈరోజు మొదలుపెట్టిన పనులన్నీ 60 రోజులలో పూర్తిచేస్తానని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రజలకు వాగ్ధానం చేశారు.
తనకు సిఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తున్నారు కనుకనే శంఖుస్థాపనలు చేసి 60 రోజులలో అన్ని పనులు పూర్తి చేస్తానని హామీ ఇస్తున్నానని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి చెప్పారు.
అయితే తానేమీ ఇదేదో ఘనకార్యంగా భావించడం లేదని, ప్రజలు తనపై నమ్మకంతో మళ్ళీ గెలిపించారు కనుక వారి ప్రతినిధిగా నియోజకవర్గంలో వారి సమస్యలను పరిష్కరించడం తన బాధ్యతని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి చెప్పారు.
నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మొదలుపెట్టిన ఈ పనుల గురించి మంత్రి నారా లోకేష్ దృష్టికి రావడంతో ఆయనని అభినందిస్తూ ట్వీట్ చేశారు.
కూటమిలో చాలా మంది ఎమ్మెల్యేలు ఇప్పుడు తమ తమ నియోజకవర్గాలలో గుంటలు పడిన రోడ్లు మరమత్తు చేయించుకున్నారు. అవసరమైన చోట కొత్త రోడ్లు వేయించుకున్నారు. తమ తమ నియోజకవర్గాలలో చిరకాలంగా అపరిష్కృతంగా ఉన్న అనేక పనులను చకచకా చేయించుకుంటున్నారు. ఆ ఫోటోలు తరచూ మీడియాలో వస్తూనే ఉన్నాయి కూడా.
జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేతులెత్తేసిన ఎమ్మెల్యేలే ఇప్పుడు అన్ని పనులు చేయించడం చూస్తే జగన్ పాలనకు, చంద్రబాబు నాయుడు పాలనకు ఎంత తేడా ఉందో అర్దం చేసుకోవచ్చు.




