ఎప్పుడూ సామాజిక అంశాలను మేళవించి చిత్రాలను తెరకెక్కించే దర్శకుడు క్రిష్, ఇటీవల ఓ చారిత్రక పాయింట్ ను కధగా ఎంచుకుని సూపర్ సక్సెస్ అయిన విషయం తెలిసిందే. ఇప్పటివరకు తను దర్శకత్వం వహించి, నిర్మించిన సినిమాల కంటే మిన్నగా “గౌతమీపుత్ర శాతకర్ణి”ని తెలుగు ప్రేక్షకులు ఆదరించడంతో క్రిష్ చూపు చారిత్రాత్మక సినిమాల వైపుకు మళ్ళినట్లుగా కనపడుతోంది. దీంతో త్వరలో తానూ మరో రెండు చారిత్రాత్మక సినిమాలకు దర్శకత్వం వహిస్తానని ప్రకటించారు.
‘గౌతమీపుత్ర శాతకర్ణి’ సినిమాను ఆదరించిన తెలుగు ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలుపుతూ… ఈ విజయం తనకు ఎంతో ఉత్సాహాన్ని ఇచ్చిందని, ఈ కధను తెలుగు ప్రేక్షకులకు తెలియజేయడం పట్ల తనకు మిక్కిలి సంతోషంగా ఉందని, ఈ ప్రోత్సాహంతో తెలుగులో “శ్రీకృష్ణదేవరాయలు, గౌతమీ బుద్ధుడు” వంటి చారిత్రాత్మక సినిమాలను తెరకెక్కించడానికి ప్రయత్నిస్తానని చెప్పారు. అయితే ఈ చారిత్రాత్మక కధలను కూడా బాలకృష్ణతోనే తీస్తారా? లేక ఇతర హీరోలతో చేస్తారా? అనేది ఆసక్తికరంగా మారింది.
ముఖ్యంగా శ్రీకృష్ణదేవరాయలు పాత్ర మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఇప్పటివరకు తెలుగు తెరపై ‘శ్రీకృష్ణదేవరాయలు’ అనగానే, టక్కున గుర్తుకు వచ్చేది ఒక్క బాలకృష్ణ మాత్రమే. ‘ఆదిత్య 369’ సినిమాలో శ్రీకృష్ణదేవరాయలు పాత్ర అలాంటిది. ఆ ఆహార్యం, ఆ రాజసం ఒక్క బాలయ్యకే సొంతం. కానీ, తాజాగా ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ విషయంలో బాలయ్య లుక్ అభిమానులు, సినీ ప్రేక్షకులు కొంత అసంతృప్తికి గురిచేయడంతో, మళ్ళీ నందమూరి నటసింహం వైపుకు మొగ్గుచూపుతారా అనేది ఆసక్తికరంగా మారింది.



