సంధి కోసమా… చెల్లి కోసమా..?

BRS_KTR_Kavitha

బిఆర్ఎస్ పార్టీ ఓటమితో సగం కుంగిపోతే, కేసీఆర్ గాయంతో కొంత నైరాశ్యంలోకి వెళ్ళింది. ఇక కవిత అరెస్టుతో పార్టీ ఖాళీ అనే దిశగా సాగింది. కవిత అరెస్టయ్యి దాదాపు 4 నెలలు గడుస్తున్నా ఇంకా కవితకు తీహార్ జైలు నుంచి మోక్షం దొరకలేదు. అయితే కవిత బయటకు రావాలి అంటే బిఆర్ఎస్ పార్టీ పగ్గాలు బీజేపీ చేతికి చిక్కాల్సిందే అనే డిమాండ్ తెర మీదకు తెచ్చింది కాంగ్రెస్ పార్టీ.

అలాగే తెలంగాణలో బీజేపీ ని దెబ్బకొట్టడానికే బిఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు కుమ్మక్కయ్యాయి, అందులో భాగంగానే బిఆర్ఎస్ పార్టీ నేతలందరూ కాంగ్రెస్ పార్టీ గూటికి చేరుతున్నారు, అతి త్వరలో బిఆర్ఎస్ కాంగ్రెస్ లో విలీనం కాబోతుంది అంటూ బీజేపీ తన అభిప్రాయాన్ని వినిపించింది.

ADVERTISEMENT

అయితే ఎవరి వాదన ఎటు ఉంచిన బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ మాత్రం కవిత అరెస్టు విషయంలో, కానీ పార్టీ విలీనం విషయంలో కానీ ప్రత్యర్థి పార్టీల ఆరోపణలకు కౌంటర్ వెయ్యలేదు, సొంత పార్టీ నేతలకు భరోసా కల్పించలేదు. అయితే ఇవన్నీ ఇలా జరుగుతున్న నేపథ్యంలో నేడు బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ 20 మంది బిఆర్ఎస్ ఎమ్మెల్యే లను వెంటపెట్టుకుని హస్తినకు పయనమయ్యారు.

అయితే వీరి పర్యటన వెనుక దాగిఉన్న ఆ చిదంబర రహస్యం ఏమిటనే దాని మీదే తెలంగాణ రాజకీయాలలో చర్చ జరుగుతుంది. రేపు కవిత బెయిల్ పిటిషన్ విచారణకు రానున్న నేపథ్యంలో కవితకు న్యాయస్థానం బైలు ఇచ్చే అవకాశం ఉన్నందున కవితకు పార్టీ తరుపున గ్రాండ్ వెల్కమ్ చెప్పడానికే కేటీఆర్ హస్తిన యాత్ర అంటూ ఒక వాదన వినపడుతుంది.

అలాగే బీజేపీ పెద్దలతో బిఆర్ఎస్ తరుపున సంధి చర్చలు జరపడానికే కేటీఆర్ ఢిల్లీ పర్యటన అంటూ మరొక వాదన నడుస్తుంది. ఇప్పటికే ఢిల్లీ లిక్కర్ స్కాం లో అరెస్టయిన కేజ్రీవాల్, మనీష్ సిసోడియా ఇలా ఒక్కొక్కరికి న్యాయస్థానం బైలు మంజూరు చేస్తున్న నేపథ్యంలో రేపు కవిత వంతు రావచ్చు అనే ఊహకు ఎక్కువ బలం చేకూరుతుంది. అయితే సందైనా, బెయిల్ అయినా అన్ని చెల్లి కోసమే అన్నది వాస్తవం.

ADVERTISEMENT
Latest Stories