“జగన్ అన్ని లక్షల కోట్లు ప్రజలకు పంచిపెట్టినా ఎన్నికలలో ఎందుకు ఓడిపోయారో అర్దం కావడం లేదంటూ,” కేటీఆర్ చేసిన తాజా వ్యాఖ్యలతో జగన్పై ప్రేమ ఏమాత్రం తగ్గలేదని కేటీఆర్ నిరూపించుకున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించేసిన జగన్ అంటే ఇంత అభిమానం చూపుతున్న కేటీఆర్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అప్పుడే అభివృద్ధి చేసేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తున్న చంద్రబాబు నాయుడు పేరు పలకడానికి కూడా ఇష్టపడటం లేదు.
కానీ కేంద్రం నుంచి నిధులు సాధించుకోవడం కోసం ఆయన చేస్తున్న ప్రయత్నాల గురించి ‘బ్లూమ్ బెర్గ్ రిపోర్ట్’లో వచ్చిన ఓ కధనాన్ని ట్యాగ్ చేస్తూ కేటీఆర్ ట్వీట్ చేయడం, దానిని కూడా తమ పార్టీకి అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం చేయడం రెండూ చాలా హాస్యాస్పదంగా అనిపిస్తాయి.
చంద్రబాబు నాయుడు ఇటీవల ప్రధాని నరేంద్రమోడీ, కేంద్ర ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్లను కలిసినప్పుడు అప్పుల ఊబిలో కూరుకుపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బయటపడేందుకు, 0.5 శాతం వడ్డీతో రూ. 1,50,000 కోట్లు 50 సంవత్సరాల దీర్గకాల రుణాలు ఇప్పించాలని, అమరావతి, పోలవరం నిర్మాణ పనులు పూర్తిచేసేందుకు రాష్ట్రానికి మరో 77,000 కోట్ల రూపాయలు ఆర్ధిక సాయం అందించాలనికోరగా, అందుకు వారు సముఖంగా స్పందించిన్నట్లు సమాచారం లభించిందని ‘బ్లూమ్ బెర్గ్ రిపోర్ట్’లో పేర్కొంది.
దానినే కేటీఆర్ ట్యాగ్ చేస్తూ, “కేంద్రం నుంచి నిధులు రాబట్టుకోవడానికి ఓ బలమైన ప్రాంతీయ పార్టీని ఎన్నుకోవడం ఎంత అవసరమో ఇది నిరూపిస్తోంది. తెలంగాణ ప్రజలు దీనిని నిశితంగా గమనిస్తున్నారని ఆశిస్తున్నాను. స్వీయ రాజకీయ అస్తిత్వమే తెలంగాణకు శ్రీరామ రక్ష,” అని కేటీఆర్ ట్వీట్ చేశారు.
అయితే గత పదేళ్ళుగా తెలంగాణ ప్రజలు తమ పార్టీకే అధికారం కట్టబెట్టారనే విషయం కేటీఆర్ మరిచిన్నట్లున్నారు. అధికారంలో ఉన్నంత కాలం ప్రధాని నరేంద్రమోడీపై కేసీఆర్ కత్తులు దూస్తూనే ఉన్నారు. ప్రధాని మోడీని అవహేళన చేస్తూనే ఉన్నారు. ప్రధాని మోడీ హైదరాబాద్ వస్తే ఆయనకు స్వాగతం పలుకకపోగా చాలా అవమానకరంగా వ్యవహరించేవారు. చివరికి మోడీని గద్దె దించుతానని కేసీఆర్ ప్రగల్భాలు పలికేవారు.
కేవలం కేసీఆర్ అహంకారం, అందరితో కయ్యమాడే గుణం వలననే తెలంగాణ రాష్ట్రం ఎంతగానో నష్టపోయింది. అది ఒప్పుకునేందుకు కేసీఆర్, కేటీఆర్లకు ఇంకా అహం అడ్డొస్తోంది.
నేటికీ చంద్రబాబు నాయుడు పేరు పలకడానికి కూడా కేటీఆర్ ఇష్టపడటం లేదు. కానీ చంద్రబాబు నాయుడు కేంద్రం నుంచి నిధులు సాధించుకునే ప్రయత్నాలు చేస్తుంటే, అది చూపిస్తూ తెలంగాణ ప్రజలు బిఆర్ఎస్ పార్టీనే ఎన్నుకుంటే మంచిదని కేటీఆర్ చెప్పుకోవడం చాలా హాస్యస్పదంగా ఉంది కదా?
This is how you get your way in Delhi. By voting for strong regional parties which can deliver the goods
I hope people of Telangana are watching closely
స్వీయ రాజకీయ అస్థిత్వమే
తెలంగాణకు శ్రీరామ రక్ష https://t.co/7PqF2nBcQj— KTR (@KTRBRS) July 11, 2024




