తెలంగాణ శాసనసభ ఎన్నికలలో బిఆర్ఎస్ పార్టీ ఎందుకు ఓడిపోయిందో తెలుగు ప్రజలలో ఎవరిని అడిగినా చెపుతారు. బిఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలకు కూడా ప్రగతి భవన్లోకి అనుమతి లభించేది కాదు. కేసీఆర్ని కలిసేందుకు అవకాశం లభించేది కాదు. ఇక కేసీఆర్ని కలవటం అనేది సామాన్య ప్రజలు కలలో కూడా ఊహించలేరు. ప్రజలకు, ప్రజా ప్రతినిధులకు కేసీఆర్ దూరంగా ఉండిపోవడం కూడా బిఆర్ఎస్ ఓటమికి ఓ కారణమని అందరికీ తెలుసు.
తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి ఇది బాగా గుర్తించి ఇదే ప్రజలు గ్రహించేలా చేశారు కనుకనే కేసీఆర్ని ఓడించగలిగారు. కాస్త ఆలస్యంగా కేసీఆర్, కేటీఆర్ కూడా ఈవిషయం గ్రహించిన్నట్లే ఉన్నారు. అందుకే నూతన సంవత్సరం సందర్భంగా సోమవారం బిఆర్ఎస్ కార్యాలయానికి పారిశుధ్య కార్మికులను ఆహ్వానించి కేటీఆర్ వారితో కలిసి భోజనం చేశారనుకోవచ్చు. అలాగే కేసీఆర్ కూడా ఇప్పుడు సామాన్య ప్రజలను కలుస్తున్నారు.
ఇప్పుడు ముఖ్యమంత్రి పదవిలో లేరు కనుక కేసీఆర్కు పని ఒత్తిడి తగ్గి అందరినీ కలవగలుగుతున్నారని బిఆర్ఎస్ పార్టీ ఎంత సమర్ధించుకొంటున్నప్పటికీ, సామాన్య ప్రజలను దూరంగా పెట్టడం వలననే ఎన్నికలలో బిఆర్ఎస్ పార్టీ ఓడిపోయిందని గ్రహించిన్నట్లే ఉన్నారు.
ఒకవేళ ఆ ఓటమి ప్రభావం కాదనుకొంటే త్వరలో జరుగబోయే లోక్సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని కేసీఆర్, కేటీఆర్ సామాన్య ప్రజలను కలుస్తున్నట్లు భావించవచ్చు. అయితే బిఆర్ఎస్ పార్టీ ఓటమికి మరో ప్రధాన కారణం కేసీఆర్, కేటీఆర్, బిఆర్ఎస్ నేతల అహంభావం కూడా. అది ఇంకా తగ్గిన్నట్లు లేదు.
రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏదో ఓ రోజు కూలిపోతుందని, ఆరు గ్యారెంటీలు అమలుచేయడానికి ఆయనకు మూడు నెలలు సమయం ఇస్తున్నామంటూ కేటీఆర్, హరీష్ రావు మాట్లాడుతున్న మాటలు వారి అహంభావాన్ని సూచిస్తున్నాయి. కనుక ఈ అహంభావాన్ని తగ్గించుకోకపోతే లోక్సభ ఎన్నికలలో కూడా బిఆర్ఎస్ పార్టీకి ఓటమి తప్పదు.




