కర్నూలు హైకోర్టు బెంచ్ ఏర్పాటు ఎంత వరకు వచ్చిందో?

Kurnool High Court Bench

ఏపీలో అధికార, ప్రతిపక్షాల మద్య జరుగుతున్న రాజకీయ ఆధిపత్యపోరులో ప్రజలు కూడా కొట్టుకుపోతున్నారంటే అతిశయోక్తి కాదు. ఆ రెండు పార్టీల వాదనల గురించి చర్చించుకుంటూ ఎవరి పార్టీలను బట్టి వారు తీర్పులు చెప్పుకుంటూ కాలక్షేపం చేస్తున్నారు. ప్రజలలో ఈ రాజకీయ చైతన్యం అవసరమే కానీ వారికీ, రాష్ట్రానికి అవసరమైన చైతన్యం ఇది కాదు.

యువగళం పాదయాత్రలో నారా లోకేష్‌ ప్రతీ 100 కిమీలకు ఓ శిలాఫలకం వేయించి దానిపై హామీలు చెక్కించారు. అప్పుడే రెండేళ్ళు కావస్తోంది కనుక ఆ హామీలన్నీ నేరవేర్చారా లేదా వాటిలో ఎన్ని నెరవేర్చారు? లేకపోతే ఎందువల్ల? ఇంకా ఎప్పుడు నెరవేరుస్తారు? అని టీడీపి నేతలని అడగాలి.

ADVERTISEMENT

యువగళం పాదయాత్ర కర్నూలు మీదుగా సాగుతున్నప్పుడు హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ దిశలో కొన్ని అడుగులు కూడా వేసింది. ఆ తర్వాత మళ్ళీ నేటి వరకు ఆ ఊసే లేదు!

అంటే ఆ హామీ అటకెక్కిపోయిందా? లేక ఏ దశలో ఉంది? ఆలస్యానికి కారణాలు ఏమిటి? ఎప్పటిలోగా కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తారు? టీడీపి నేతలు, ప్రభుత్వం చెప్పాలి.

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వైజాగ్, విజయవాడలో మెట్రో అంటూ చాలా హడావుడి చేసింది. కానీ ఇప్పుడా ఊసే లేదు! ఎందువల్ల? ఈ రెండు ప్రాజెక్టులు అటకెక్కిపోయాయా? ఎక్కిపోతే ఎందుకు? లేదా ప్రస్తుతం అవి ఏ దశలో ఉన్నాయి? ప్రభుత్వమే చెప్పాలి.

విశాఖని ఐటి రాజధాని అని చెప్పినప్పుడు క్వాంటం వ్యాలీని విశాఖలోనే ఏర్పాటు చేయాలి కదా? కానీ అమరావతిలో ఏర్పాటు చేస్తున్నారు? ఎందువల్ల?

విశాఖలో అనేక ఐటి కంపెనీలు, అనేక భారీ వాణిజ్య సంస్థలు, భోగాపురం వద్ద అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం సిద్దం అవుతున్నప్పుడు, వాటితో పెరగబోయే జనాభా, వాహనాలు రద్దీ తట్టుకునేందుకు నేటికీ కొత్తగా ఒక్క ఫ్లై ఓవర్ నిర్మాణ పనులు ఎందుకు మొదలుపెట్టలేదు?ఒకవేళ ప్లానింగ్ జరుగుతుంటే, అవి ఏ దశలో ఉన్నాయి? ఎప్పుడు మొదలుపెడతారు? ఎప్పుడు పూర్తి చేస్తారు?

మొదటి విడత రాజధాని భూసేకరణలో రైతులందరికీ ఒప్పందం ప్రకారం నష్టపరిహారాలు, ప్లాట్లు కేటాయించారా లేదా? లేకపోతే ఎందువల్ల?ఇంకా ఎప్పుడు వారికి న్యాయం చేస్తారు? రాజధాని విస్తరణ కొరకు రెండో విడత భూసేకరణ ప్రక్రియపై కూడా ఇవే ప్రశ్నలున్నాయి.

కనుక ప్రజలు ఆలోచించాల్సిన విషయాలు, ప్రజా ప్రతినిధులను అడగాల్సినవి ఇలాంటి విషయాలు తప్ప కూటమి ప్రభుత్వం, వైసీపీ మద్య జరుగుతున్న రాజకీయాల గురించి కాదు.

ADVERTISEMENT
Latest Stories