టిడిపి అధికారంలో ఉన్నా ఆగని టిడిపి నేతల హత్యలు!

Kurnool TDP Leader Srinivasulu Was Brutally Murdered

కర్నూలు జిల్లా పత్తికొండ మండలంలో హోసూరులో టిడిపి నేత వాకిటి శ్రీనివాసులు (45) బుధవారం తెల్లవారుజామున దారుణ హత్యకు గురయ్యారు. బహిర్భూమికి వెళ్ళినప్పుడు అక్కడ కాపు కాసిన గుర్తు తెలియని దుండగులు ఆయన కళ్ళలో కారం చల్లి వేట కొడవళ్ళతో నరికి దారుణంగా చంపారు.

ADVERTISEMENT

మృతుడు శ్రీనివాస్ స్థానిక టిడిపి ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు ప్రధాన అనుచరుడు. శాసనసభ ఎన్నికల సమయంలో శ్యాంబాబు గెలుపు కోసం రేయింబవళ్ళు కష్టపడి పనిచేశారు.

ఈవిషయం తెలుసుకున్న శ్రీనివాసులు భార్య పిల్లలు, ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు, డీఎస్పీ శ్రీనివాస రెడ్డి, సీఐ జయన్న వెంటనే ఘటనస్థలికి చేరుకున్నారు. ఎమ్మెల్యే శ్యాంబాబు శ్రీనివాసులు కుటుంబ సభ్యులను ఓదార్చి వారి కుటుంబానికి అండగా నిలబడతానని ధైర్యం చెప్పారు.

డీఎస్పీ శ్రీనివాస రెడ్డి విలేఖరులతో మాట్లాడుతూ, “మృతుడి కంట్లో, ఒంటిపై కారంపొడి ఉంది. తల వెనుక భాగంలో బలమైన గాయం ఉంది. ఘటన స్థలానికి కొంత దూరంలో నీరు సీసాలు లభించాయి. అంటే ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది కాపు కాసి పధకం ప్రకారం శ్రీనివాసులుని హత్య చేసిన్నట్లు స్పష్టమవుతోంది. పోలీస్ ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి హంతకులను పట్టుకుంటాము,” అని చెప్పారు.

జగన్‌ ప్రభుత్వం అధికారంలో ఉన్న 5 ఏళ్ళలో నిత్యం టిడిపి కార్యకర్తలు, మద్దతుదారులపై దాడులు జరుగుతూనే ఉండేవి. పలువురు హత్య చేయబడ్డారు. చివరికి చంద్రబాబు నాయుడు, పవన్‌ కళ్యాణ్‌, నారా లోకేష్‌, అచ్చన్నాయుడు, అయ్యన్నపాత్రుడు వంటి సీనియర్లు కూడా జగన్‌ ప్రభుత్వ వేధింపులను తప్పించుకోలేకపోయారు.

కానీ ఇప్పుడు టిడిపియే అధికారంలో ఉంది. మొత్తం పోలీస్, నిఘా వ్యవస్థలు ప్రభుత్వం చేతిలోనే ఉన్నాయి. అయినా ఈవిదంగా టిడిపి కార్యకర్తలు హత్య చేయబడుతుండటం సిగ్గుచేటు.

శ్రీనివాసులుకి ఎవరితో ఎటువంటి వివాదాలు లేవని కుటుంబ సభ్యులు చెపుతున్నారు. అంటే ఇది రాజకీయ హత్య కావచ్చు. టిడిపి కార్యకర్తని హత్య చేయాల్సిన అవసరం ఏ పార్టీకి ఉంది?అని ఆలోచిస్తే టిడిపి చేతిలో ఓడిపోయిన వైసీపికే అనే అనుమానం కలుగడం సహజం.

రాష్ట్రంలో వైసీపి కార్యకర్తల హత్యలు జరుగుతున్నాయని వాదిస్తున్న వైసీపి అధినేత జగన్‌, ఇప్పుడు టిడిపి కార్యకర్త శ్రీనివాసులు హత్యకు ఎవరిని నిందిస్తారో?

ADVERTISEMENT
Latest Stories