వర్తమానం నుండి ఒక్కసారి మూడేళ్ళు వెనక్కి వెళితే… కాంగ్రెస్ పార్టీ చేసిన కుట్ర కుతంత్రాలకు సీమాంధ్ర భగ్గుమంటున్న రోజులవి. కాంగ్రెస్ పార్టీ నేతలు ఎక్కడి దొరికితే అక్కడ పట్టుకుని నిలదీయడం… విభజనకు వ్యతిరేకంగా రాస్తారోకోలు, బంద్ లు…. ఇలా ఒకటేమిటి కాంగ్రెస్ దుర్భుద్ధి రాజకీయానికి ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం మొత్తం రోడ్లపైకి వచ్చిన పరిస్థితులు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో లగడపాటి రాజగోపాల్ వంటి కొందరు నేతలు కాంగ్రెస్ అధిష్టానానికి ఎదురు తిరిగే పరిస్థితులు ఏర్పడ్డాయి.
అందులో భాగంగానే పార్లమెంట్ లో ఎలాగైనా విభజన బిల్లును అడ్డుకుని తీరుతామని రాష్ట్ర ప్రజలకు మాటిచ్చి, ఢిల్లీ వెళ్లారు లగడపాటి అండ్ కో. అయితే నాడు జరిగిన నాటకీయ పరిస్థితులలో… టెలివిజన్ లైవ్ ఆపించి, ఏపీ ఎంపీలను తంతూ కాంగ్రెస్ దారుణానికి ఒడిగట్టడంతో, అనివార్య పరిస్థితులలో నాటి విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్, ‘పెప్పర్ స్ప్రే’ను పార్లమెంట్ లో ప్రయోగించారు. ఏపీ ఎంపీలపై చేసిన భౌతిక దాడులపై ఎలాంటి కేసులు నమోదు కాకపోయినా, లగడపాటి ప్రయోగించిన ‘పెప్పర్ స్ప్రే’పై మాత్రం ఓ కేసు నమోదైంది.
తెలంగాణా కాంగ్రెస్ ఎంపీ పొన్నం ప్రభాకర్ ఈ కేసును లగడపాటిపై నమోదు చేయగా, మంగళవారం నాడు దీనిపై సుప్రీంకోర్టు తుది తీర్పును ఇచ్చింది. దేశం మొత్తాన్ని షాక్ కు గురి చేసిన ఈ కేసును సుప్రీంకోర్టు కొట్టివేస్తూ తీర్పునివ్వడం హర్షించదగ్గ విషయం. దాదాపుగా మూడేళ్ళు గడిచినప్పటికీ, నాటి ‘పెప్పర్ స్ప్రే’ సంఘటన గుర్తు చేసుకుంటే, సీమాంధ్ర వాసులు రగిలిపోవడం సహజం. ఇక, నాడు ‘పెప్పర్ స్ప్రే’ను ప్రయోగించిన లగడపాటి రాజగోపాల్, ఆ తదనంతరం రాజకీయాలకు ‘గుడ్ బై’ చెప్పిన విషయం తెలిసిందే.



