ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల సందర్భంగా సోమవారం రాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతి ద్రౌపదీ రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము చేతుల మీదుగా ఎన్టీఆర్ పేరిట రూ.100 నాణేలు విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి చంద్రబాబు నాయుడుతో సహా ఎన్టీఆర్ కుటుంబ సభ్యులందరినీ కేంద్ర ప్రభుత్వం ఆహ్వానించింది. కానీ ఎన్టీఆర్ భార్యనని చెప్పుకొని రాజకీయాలు చేస్తున్న లక్ష్మీ పార్వతిని మాత్రం ఆహ్వానించలేదు. తనను కూడా ఆహ్వానించాలని ఆమె వ్రాసిన లేఖలను కూడా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదు. దీనిపై ఆమె భగ్గుమన్నారు.
హైదరాబాద్లో ఆమె మీడియాతో మాట్లాడుతూ, ఎన్టీఆర్ తనను పెళ్ళి చేసుకొన్నట్లు ఆనాడు వార్తాపత్రికలలో వచ్చిన వార్తలను, వాటిలో దండలతో దిగిన తమ ఫోటోలను మీడియాకు చూపించి ఇవన్నీ అబద్దామా?ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు చెప్పాలని నిలదీశారు. తనను తల్లిగా వారు గౌరవించనప్పటికీ తాను పట్టించుకోలేదని, కానీ అందరూ కలిసి ఈ కార్యక్రమానికి తనను రాకుండా అడ్డుకోవడాన్ని సహించలేకపోతున్నానని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు అందరూ కలిసి ఎన్టీఆర్ను మోసం చేశారని ఆమె ఆరోపించారు. ఇంకా ఎంత కాలం ఎన్టీఆర్ భార్యని అనే బోర్డు మెడలో వేసుకొని తిరగాలి?నన్ను ఎన్టీఆర్ భార్యగా గుర్తించరా?అని ఆమె ప్రశ్నించారు.
తనకు జరిగిన ఈ ఘోర అవమానానికి తప్పకుండా చంద్రబాబు నాయుడు, దగ్గుబాటి పురందేశ్వరిలపై ప్రతీకారం తీర్చుకొంటానని అన్నారు. వచ్చే ఎన్నికలలో ప్రతీ నియోజకవర్గంలో పర్యటించి ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు, దగ్గుబాటి పురందేశ్వరి చేసిన ద్రోహాన్ని ప్రజలకు వివరించి వారిని రాష్ట్రం నుంచి తరిమికొడతానని లక్ష్మీ పార్వతి శపధం చేశారు.
ఎన్టీఆర్ వంద రూపాయల నాణెం విడుదల కార్యక్రమ్యాన్ని కూడా చంద్రబాబు నాయుడు రాజకీయాలకు ఉపయోగించుకొన్నారని, ఏపీ బిజెపి అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి దంపతులతో కలిసి బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో టిడిపి-బిజెపి పొత్తుల గురించి ఒత్తిడి చేశారని విజయసాయి రెడ్డి నిన్న ట్వీట్స్ చేశారు. అంతకు ముందు పురందేశ్వరిని ఉద్దేశ్యించి ఎన్టీఆర్ ఆస్తుల పంపకాల గురించి ట్వీట్ చేశారు.
ఢిల్లీలో ఈ కార్యక్రమం ముగియగానే లక్ష్మీ పార్వతి చేత ప్రెస్మీట్ పెట్టించి ఈవిదంగా మాట్లాడించి వైసీపీ కూడా రాజకీయాలు చేసింది కదా?ఒకవేళ ఆమె తన ఆవేదన వ్యక్తం చేయడానికే పరిమితం అయితే అర్దం చేసుకోవచ్చు. కానీ వచ్చే ఎన్నికలలో ఊరూరు తిరిగి టిడిపి, బిజెపిలను ఓడగొట్టి, చంద్రబాబు నాయుడు, దగ్గుబాటి పురందేశ్వరిలని రాష్ట్రం నుంచి తరిమికొడతానని చెప్పడం గమనిస్తే ఆమె వైసీపీ సూచన మేరకే ఈవిదంగా మాట్లాడారని అర్దమవుతోంది. ఎన్నికల కురుక్షేత్రంలో ఆమెను ఆయుదంగా వాడుకోబోతోందని కూడా అర్దమవుతోంది.
ఎన్టీఆర్ అంటే ఎంతో గౌరవం అంటూనే ఆయన కుటుంబాన్ని రాష్ట్రం నుంచి తరిమికొడతానని ఆమె చెప్పడాన్ని ఏమనుకోవాలి?ఎన్టీఆర్ కుటుంబ సభ్యులను ఈవిదంగా నిత్యం ఆడిపోసుకొంటూ ప్రజలను మెప్పించేందుకు ప్రయత్నించే బదులు, వచ్చే ఎన్నికలలో పోటీ చేసి రాష్ట్ర ప్రజల అభిప్రాయం కూడా తెలుసుకోవచ్చు కదా?ఆమె వెనక కొండంత అండగా వైసీపీ.. దాని అధినేత జగన్ కూడా ఉన్నారు కదా?



