నందమూరి తారకరామారావు భార్యనని చెప్పుకొంటూ లక్ష్మీ పార్వతి మాట్లాడుతున్న మాటలు చాలా జుగుప్సాకరంగా ఉన్నాయి. తారకరత్న మృతితో ఓ వైపు నందమూరి కుటుంబం తీవ్ర విషాదంలో ఉంటే, తారకరత్న ఎప్పుడో చనిపోయాడని కానీ నారా లోకేష్ పాదయాత్ర మొదలుపెట్టగానే చనిపోయాడనే అపవాదు రాకూడదనే ఉద్దేశ్యంతో ఇన్నాళ్ళు హాస్పిటల్లో ఉంచి చికిత్స చేయిస్తున్నట్లు చంద్రబాబు నాయుడు డ్రామా ఆడించారని లక్ష్మీ పార్వతి సంచలన ఆరోపణలు చేశారు. అతను చనిపోగానే నారా లోకేష్ రెండు రోజులు పాదయాత్ర వాయిదా వేసుకొని ఉంటే తారకరత్న భార్య, పిల్లలకి ఇంత కుమిలిపోయేవారు కారని లక్ష్మీ పార్వతి అన్నారు. ఈ సందర్భంగా ఆమె చంద్రబాబు నాయుడుపై తన అక్కసుని మరోసారి వెళ్ళగక్కారు.
తారకరత్నని కుప్పం నుంచి బెంగళూరులో నారాయణ హృదయాలయ హాస్పిటల్కి తరలించిన తర్వాత ఆయన భార్య అలేఖ్య రెడ్డి, ఆమె బంధువు, చంద్రబాబు నాయుడుని అమితంగా ద్వేషించే వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి, తారకరత్నని ఎంతగానో అభిమానించే బాలకృష్ణ, జూ.ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ఇంకా పలువురు వెళ్ళి వైద్యులని కలిసి మాట్లాడి తారకరత్న ఆరోగ్య పరిస్థితి గురించి అక్కడే మీడియాకి వివరించిన సంగతి తెలిసిందే.
ఒకవేళ లక్ష్మీ పార్వతి ఆరోపిస్తున్నట్లు తారకరత్న అప్పటికే చనిపోయి ఉంటే, చంద్రబాబు నాయుడుని ఎలాగైనా రాజకీయంగా చావుదెబ్బ తీయాలని ప్రయత్నిస్తున్న వైసీపీ ఊరుకొని ఉండేదే కాదు. విజయసాయి రెడ్డి హాస్పిటల్కి వెళ్ళి చూసి వచ్చిన వెంటనే ఆయనే స్వయంగా బయటపెట్టి అప్పుడే చంద్రబాబు నాయుడుని ఎండగట్టి ఉండేవారు కదా?విజయసాయి రెడ్డి నిన్న కూడా తారకరత్నకి నివాళులు అర్పించడానికి వచ్చారు. అప్పుడు బాలకృష్ణ, కళ్యాణ్ రామ్, జూ.ఎన్టీఆర్లని ఓదార్చి చంద్రబాబు నాయుడుతో మాట్లాడివెళ్ళారు. తారకరత్న శనివారం రాత్రి చనిపోయాడని హాస్పిటల్ వైద్యులు కూడా ధృవీకరించారు కదా?
కానీ టిడిపి పగ్గాలు తన చేతికి రాకుండా అడ్డుకొన్నారని చంద్రబాబు నాయుడుపై ద్వేషంతో రగిలిపోతున్న లక్ష్మీ పార్వతి ఈవిదంగా శవరాజకీయాలు చేస్తూ ఆయనపై లేనిపోని అభాండాలు వేస్తున్నట్లు అర్దమవుతోంది. తన నోటి తీరు, ప్రవర్తన నచ్చకనే ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు మొదటి నుంచి తనని దూరంగా ఉంచుతున్నారని గ్రహించకుండా అవకాశం చిక్కినప్పుడల్లా చంద్రబాబు నాయుడుపై బురద జల్లుతూనే ఉన్నారు. చంద్రబాబు నాయుడుని, బాలకృష్ణని విడదీసేందుకు ఇటువంటి కుటిలయత్నాలు చేస్తూనే ఉన్నారు. లక్ష్మీ పార్వతి తీరుని ప్రజలు కూడా తప్పు పడుతూనే ఉన్నారు. కానీ ఆమె తీరు మారడం లేదు.



