ఓ రాజకీయ పార్టీని నడిపించే వ్యక్తికి నాయకత్వ లక్షణాలు తప్పనిసరి. అవి పుష్కలంగా ఉన్నాయని జగన్ నిరూపించుకున్నారు కనుకనే వైసీపీని గెలిపించుకొని అధికారంలోకి తెచ్చి తాను ముఖ్యమంత్రి కాగలిగారు. కానీ ఆయన నాయకత్వ లక్షణాలను, రాజకీయాలను చంద్రబాబు నాయుడిపై ద్వేషం ఎల్లప్పుడూ ‘డామినేట్’ చేస్తుంటుంది.
రాజకీయ పార్టీలకి నిర్ధిష్టమైన కొన్ని విధానాలు, ఆశయాలు, లక్ష్యాలు తప్పక ఉండాలి. కానీ చంద్రబాబు నాయుడుని ద్వేషించడం, టీడీపీని దెబ్బ తీయడమే వైసీపీ విధానాలుగా మార్చుకుని ముందుకు సాగుతూ ఎన్నికలలో బోర్లా పడింది.
జగన్ అధికారంలో ఉన్నప్పుడూ, లేనప్పుడూ కూడా సొంత పార్టీని ఏవిదంగా ముందుకు తీసుకువెళ్ళాలనే ఆలోచన చేసే బదులు, టీడీపీని ఏవిదంగా దెబ్బ తీసి అధికారంలో కొనసాగాలి… మళ్ళీ అధికారంలోకి రాగలము?అనే ఆలోచిస్తున్నారు. చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేయించడం ఇందుకు చక్కటి ఉదాహరణ.
యుద్ధంలో శత్రువుని దెబ్బ తీసి ఓడిస్తేనే ఎవరైనా గెలుస్తారు. కానీ ఆ గెలుపు కోసం వెనక బలమైన సైన్యం, ఆయుధాలు కూడా ఉండాలి కదా? కానీ జగన్ అటువంటి సైన్యం, ఆయుధాలు సిద్దం చేసుకునే ఆలోచన చేయకుండా తనలాగే చంద్రబాబు నాయుడుని విపరీతంగా ద్వేషించే లక్ష్మీ పార్వతికి పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమించుకున్నారు!
ఆమె ఏనాడూ పార్టీ కార్యక్రమాలలో చురుకుగా పాల్గొన్న దాఖలాలు కనబడవు. కనీసం పార్టీ నేతలు, కార్యకర్తలతో టచ్చులో ఉన్నారో లేదో కూడా తెలీదు. పార్టీ అనేక మంది సీనియర్ నేతలు చురుకుగా పార్టీ కార్యక్రమాలలో పాల్గొంటున్నారు. కానీ జగన్ వారిని కాదని ప్రధాన కార్యదర్శి పదవికి లక్ష్మీ పార్వతిని ఎంచుకోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది.
ఆమె కూడా జగన్లాగే చంద్రబాబు నాయుడుని మనస్పూర్తిగా అమితంగా ద్వేషిస్తుంటారు కనుక అదే ఆమె ప్రధాన అర్హతగా జగన్ భావించి ఈ పదవి కట్టబెట్టి ఉండవచ్చు.
ఆమె మీడియా ముందుకు వస్తే ఆమె ఏం మాట్లాడుతారో అందరికీ తెలుసు. ఈ పదవి చేపట్టినా వైసీపీ కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారనే నమ్మకం లేదు. కానీ ఆమె మనస్పూర్తిగా చంద్రబాబు నాయుడుని తిడుతుంటే విని జగన్ సంతృప్తి పడగలరు అంతే! కనుక ఆమె నియామకం వలన వైసీపీకి రాజకీయంగా ఎటువంటి ఉపయోగమూ ఉండకపోవచ్చు.




