ఒకప్పుడు బల్బు, టెలీఫోన్, రైలు, విమానం వంటివి అందుబాటులోకి రావడానికి దశాబ్దాల కాలం పట్టింది. కానీ ఇప్పుడు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చిన తర్వాత ఏడాదికి రెండు మూడు పెద్ద ఆవిష్కరణలు జరుగుతున్నాయి. అవి అంత వేగంగానూ ప్రజలకు అందుబాటులోకి వచ్చేస్తున్నాయి.
ఉదాహరణకు ల్యాండ్ లైన్ ఫోన్ నుంచి నేడు టచ్ ఫోన్లు వరకు, ట్రంకు పెట్టె వంటి పాత టీవీల నుంచి వాల్ మౌంట్ ఎల్ఈడీ టీవీల వరకు చాలా మార్పులు వచ్చాయి.
అలాగే రోజుకో కొత్త మొబైల్ యాప్స్ అందుబాటులోకి వస్తున్నాయి. వీటన్నిటితోపాటు ఆన్లైన్ మోసాలు పెరిగిపోతూనే ఉన్నాయి. కనుక అందుబాటులోకి వచ్చిన ఈ టెక్నాలజీని దానితో లభించే సంతోషాలు, సదుపాయాలు ఉపయోగించుకోవడం అవసరమే. మోసపోకుండా ఉండాలన్నా నేర్చుకోవడం అవసరమే.
వీటికి చదువు, వయసుతో సంబంధం లేదు. ఉండదు. నేర్చుకోకపోతే చేతిలో ఎంత ఖరీదైన మొబైల్ ఫోన్, ట్యాబ్, ల్యాప్ టాప్, స్మార్ట్ వాచ్, టీవీ లేదా మరేవైనా పరికరాలు ఉన్నా అవన్నీ నిరుపయోగమే. ఈ ఆధునిక పరికరాలు వాడటం రానివారిని సమాజంలో నిరక్షరాస్యులుగా పరిగణించే పరిస్థితి కూడా నెలకొని ఉంది.
ఈ అత్యాధునిక పరికరాలు, మొబైల్ యాప్స్ వినియోగించుకోవడం నేర్చుకుంటే సుఖపడవచ్చు లేకుంటే ఎప్పటిలాగే కరెంట్ బిల్, ఫోన్ బిల్, ఇంటి పన్ను, ట్రైన్, బస్, విమాన టికెట్స్ రిజర్వేషన్స్ వంటి వాటి కోసం క్యూలైన్లలో నిలబడాల్సిందే.
అలాగని ఒకేసారి కుప్పలు తెప్పలుగా అందుబాటులోకి వస్తున్న ఈ అత్యాధునిక పరికరాలు, టెక్నాలజీ పట్ల అవగాహనా పెంచుకోవడం కూడా పెద్ద కష్టం కాదిప్పుడు. ఎవరినో అడిగి వారు విసుక్కుంటే మనసు చిన్నబుచ్చుకోవలసిన అవసరం కూడా లేదిప్పుడు.
ఇప్పుడు ప్రతీ దానికీ యూట్యూబ్లో వీడియోలున్నాయి. ఇంకా చాట్ జీపీటీ, జెమిని వంటి ఏఐ యాప్స్, టూల్స్ కూడా అందుబాటులోకి వచ్చాయి. అవి మన సందేహాలను నివృతి చేయగలవు. ఒకటికి పదిసార్లు అడిగి, చూసి తెలుసుకోవచ్చు.
ఒకప్పుడు లేచి టీవీ వద్దకు వెళ్ళి ఛానల్ మార్చుకోవడం ఆన్ ఆఫ్ చేసుకోవలసి వచ్చేది. కానీ ఇప్పుడు రిమోట్ మళ్ళీ దానిలో వాయిస్ కంట్రోల్ కూడా వాడుకుంటూ సుఖపడుతున్నాము కదా? అలాగే అందుబాటులోకి వస్తున్న వీటన్నిటితో జీవితం సుఖమయం చేసుకోవచ్చు. ఒకవేళ సుఖమయం కాకపోయినా కనీసం శారీరిక, మానసిక శ్రమ, ఒత్తిడి తగ్గిస్తాయి. జీవితంలో చాలా తోడ్పడతాయి.
కనుక చదువుకోలేదు… ఈ వయసులోనా? అని అనుకోకుండా నేర్చుకోవడం చాలా అవసరమే… అలాగే ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతుండటం కూడా అవసరమే.







