స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన సంక్రాంతి సినిమా ‘అల వైకుంఠపురంలో’. భారీగా హిట్ కొట్టడంతో టీం అంతా చాలా ఆనందంగా ఉంది. బన్నీకి ఇప్పటివరకు 100 కోట్ల షేర్ సినిమా లేదు, అయితే ఈ సినిమాతో ఏకంగా 150 కోట్ల షేర్ సినిమా కొట్టేశాడు. అయితే ఇప్పుడు ఈ సినిమాకు అనుకోని తిప్పలు వచ్చి పడ్డాయట.
అసలు విషయానికి వస్తే .. కృష్ణ అనే దర్శకుడి దగ్గర నుండి త్రివిక్రమ్ కథను కాపీ కొట్టాడని అందుకనే సదరు దర్శకుడు త్రివిక్రమ్కి లీగల్ నోటీసులు ఇవ్వాలనుకుంటున్నాడని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. కృష్ణ 2013లోనే ఈ కథను రాసి ఫిలించాంబర్లో రిజిష్టర్ చేయించాడట.
స్క్రిప్ట్ ఫస్ట్ పేజీని డైరెక్టర్ త్రివిక్రమ్ కి అప్పట్లో చూపించా అని కూడా చెబుతున్నాడు అతను. తను దశ-దిశ పేరుతో సినిమా తీయాలనుకుంటుండగా త్రివిక్రమ్ `అల వైకుంఠపురములో` సినిమా తీశాడని సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. మరి దీనిపై చిత్ర యూనిట్ ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.
మరోవైపు త్రివిక్రమ్ తన తరువాతి సినిమా యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో చెయ్యబోతున్నట్టు సమాచారం. అయితే ఎన్టీఆర్ జూన్ లోపల ఆర్ఆర్ఆర్ నుండి రిలీవ్ అయ్యే అవకాశం లేదు. దానితో కొంత కాలం రెస్ట్ తీసుకున్న తరువాత ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ మొదలు పెట్టబోతున్నాడు త్రివిక్రమ్.



