కీలక ఆటగాళ్ళకు విశ్రాంతినిచ్చి యువ ఆటగాళ్ళతో బరిలోకి దిగిన టీమిండియాకు షాక్ ఇద్దామనుకున్న జింబాబ్వే ఆశలు నెరవేరలేదు. దీంతో మూడు వన్డేల సిరీస్ లో భారత్ 1-0తో ముందడుగు వేసింది. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియాకు పేస్ బౌలర్ శ్రాణ్ రెండవ ఓవర్లోనో శుభారంభాన్ని అందించాడు. అలాగే ఇతర బౌలర్లు కులకర్ణి, బూమ్రాలు అద్భుతమైన లైన్ అండ్ లెంగ్త్ లతో బౌలింగ్ చేయడంతో కేవలం 168 పరుగులకు జింబాబ్వే ఆలౌట్ అయ్యింది.
బూమ్రా 4 వికెట్లు, కులకర్ణి, శ్రాణ్ లు చెరో రెండు వికెట్లు తీయగా, అక్సర్ పటేల్, చాహల్ లు ఒక్కో వికెట్ తీసి జింబాబ్వే పతనాన్ని శాసించారు. ఇక, స్వల్ప లక్ష్యంతో బరికిలో దిగిన భారత్ కరుణ్ నాయర్ (7) రూపంలో తొలి వికెట్ ను కోల్పోయింది. అయితే వన్ డౌన్ లో బరిలోకి దిగిన అంబటి రాయుడు అండతో మరో ఓపెనర్ రాహుల్ భారత్ కు అద్భుత విజయాన్ని అందించాడు.
తొలి మ్యాచ్ లోనే 115 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్సర్ తో అజేయమైన 100 పరుగులు చేసి టీమిండియాకు ఓపెనర్ ఆప్షన్ ను ఇచ్చాడు. ఇటీవల ఐపీఎల్ లో బెంగుళూరు తరపున దుమ్ము దులిపిన రాహుల్, అదే ఫాంను కొనసాగించి విజయంలో కీలక భూమిక పోషించాడు. అలాగే ముంబై ఇండియన్స్ తరపున చెడుగుడు ఆడిన అంబటి రాయుడు కూడా 62 పరుగులతో రాణించాడు. దీంతో స్వల్ప లక్ష్యాన్ని 43వ ఓవర్లోనే టీమిండియా విజయాన్ని అందుకుంది.



