టాలీవుడ్ లో ‘కమిట్మెంట్’ కీలకపాత్ర పోషిస్తుందంటూ పెదవి విప్పిన హీరోయిన్ల జాబితాలో తెలుగు బ్యూటీ మాధవిలత కూడా ఒకరు. ‘నచ్చావులే’ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీకి ఆ తర్వాత ఆశించిన మేరకు అవకాశాలు రాకపోవడానికి ఇదే కారణమంటూ గతంలో సంచలన ప్రకటనలు చేసింది. సినీ కెరీర్ దాదాపుగా ముగిసిన తరుణంలో ఇటీవలే బిజెపిలో చేరిన మాధవిలత, తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన పొలిటికల్ కెరీర్ తో పాటు టాలీవుడ్ లో ఉన్న కాస్టింగ్ కౌచ్ పై కూడా స్పందించారు.
చిత్రసీమపై ఎన్ని ‘కాస్టింగ్ కౌచ్’ ఆరోపణలు వచ్చినా, వచ్చేవారు వస్తూనే ఉంటారని, పబ్లిసిటీ అయిన ఆ రెండు రోజులు మాత్రం కాస్త హడావుడి ఉంటుంది తప్ప ఏం జరగదని తేల్చేసింది. ప్రస్తుతం ఇండస్ట్రీకి వస్తోన్న 19, 20 ఏళ్ళ యువతరానికి పూర్తి స్పష్టత ఉందని, ‘వాళ్ళకేం కావాలి – వాళ్ళేం ఇవ్వాలి’ అన్న దానిపై పూర్తి అవగాహనతో ఉందని, వాటికి మానసికంగా ప్రిపేర్ అయ్యి వస్తున్నారు గనుక తాను వారికి సందేశాలు ఇచ్చే స్థాయిలో లేనని, నా తరం అయిపోయిందని, ప్రస్తుతమున్న యంగ్ జనరేషన్ స్పీడ్ కు కూడా తాను తట్టుకోలేనని చెప్పుకొచ్చింది.
నక్షత్ర ఫౌండేషన్ ద్వారా తాను కొంతసేవ చేస్తున్నానని, దానిని మరో మెట్టు ఎక్కించాలన్న ఉద్దేశం, ప్రజలకు మరింత సేవ చేయాలన్న భావనతో రాజకీయాలలో చేరానని తన భావాలు బయట పెట్టింది. తాను కాపు కులానికి చెందిన వ్యక్తినని, కానీ మా పేరెంట్స్ టిడిపి హార్డ్ కోర్ ఫ్యాన్స్ అని, ఎన్టీఆర్ పార్టీ స్థాపించిన తర్వాత మా ఫ్యామిలీ మొత్తం అప్పటి నుండి ఇప్పటివరకు పక్కా టిడిపి అభిమానులని తెలిపిన మాధవీలత, చిన్నప్పటి నుండి తనపై, తన సోదరులపై కూడా ఈ ప్రభావం ఉందని స్పష్టం చేసింది.
బిజెపికి జనసేన అనుబంధ పార్టీయో కాదో తనకు తెలియదని, పార్టీలో అలాంటి చర్చలు కూడా ఏమీ జరగలేదని, ఒకవేళ పార్టీ ఆదేశిస్తే ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి తాను సిద్ధమని తెలిపింది. గిద్దలూరు నియోజకవర్గానికి సంబంధించిన వ్యక్తినని, అయితే ఇప్పటికే సీట్లపై చాలా మంది కన్నేసారని, పార్టీ ఇప్పుడే టికెట్ ఇస్తుందని తాను ఆశించడం లేదని, ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం ఇవ్వకుండా ఒకవేళ పార్టీ నామినేటెడ్ పదవి ఇచ్చినా స్వీకరించడానికి తాను సిద్ధమని పేర్కొంది.



