ఏ దేశంలోనైనా ప్రేమ తర్వాత పెళ్ళే జరుగుతుంది. కుదరకపోతే సహజీవనం చేస్తారు. అదీ కుదరకపోతే మనలాంటి దేశాలలో పెద్దల బలవంతంతో వేరేవారిని పెళ్ళి చేసుకుంటారు. వద్దనుకుంటే ఆత్మహత్యలు చేసుకునేవారు కూడా ఉన్నారు.
కొన్ని ప్రేమలలో పెళ్ళికి ముందు మద్య శారీరిక సబందాలు ఏర్పడుతుంటాయి. అప్పుడే ఊహించని అనేక సమస్యలు ఎదురవుతుంటాయి.
ప్రేమ పేరుతో శారీరిక వాంఛలు తీర్చుకొని మోసం చేశాడంటూ ప్రియుడి ఇంటి ముందు ధర్నాలు, కోర్టు కీడ్చి న్యాయం కోరడం వంటివి చూస్తూనే ఉన్నాము. అయితే ఇలాంటి వ్యవహారంలో మద్రాస్ హైకోర్టు అనూహ్యమైన తీర్పు చెప్పింది.
తమిళనాడులో తిరునెల్వేలిలో ఓ జంట గత 9 ఏళ్ళుగా ప్రేమించుకుంటున్నారు. ఇద్దరి మద్య శారీరిక సంబంధం ఉంది. తర్వాత అతను ఆమెను వద్దనుకున్నాడు. అప్పుడు ఆమె కేసు పెట్టింది. దానిపై అతను మద్రాస్ హైకోర్టుని ఆశ్రయించాడు. ఇలాంటి సందర్భాలలో న్యాయస్థానాలు ఆడపిల్లకు న్యాయం చేసేందుకు ప్రయత్నిస్తాయి.
కానీ మద్రాస్ హైకోర్టు భిన్నంగా తీర్పు చెప్పింది. గత 9 ఏళ్ళు గాడంగా ప్రేమించుకొని, పరస్పర అంగీకారంతో శారీరిక సంబంధం పెట్టుకున్నప్పుడు, ఇద్దరిలో ఎవరైనా పెళ్ళికి నిరాకరిస్తే వారిపై క్రిమినల్ చట్టాన్ని ప్రయోగించడం సరికాదని తీర్పు చెప్పింది.
ఇద్దరూ ఇష్టపడే శారీరిక సంబంధం పెట్టుకున్నారు. వారు ఆ ఆనందం పొందడం కోసమే అలా చేశారా లేదా ఎలాగూ పెళ్ళి చేసుకుంటామనే ధైర్యంతోనే చేశారా?అనే విషయం వారిరువురికి మాత్రమే తెలుస్తుంది తప్ప ఇతరులు ఎవరికీ తెలియదు.
ఒకవేళ అతను పెళ్ళి చేసుకుంటానని మాయమాటలు చెప్పి లేదా బలవంతం చేసి ఆమెని ఒప్పించి శారీరిక సంబంధం పెట్టుకొని ఉంటే ఆమె నిరూపించగలగాలి. అప్పుడే అతనిపై క్రిమినల్ చర్యలు చేపట్టడం సాధ్యమవుతుంది. కానీ నిరూపించనందున ఈ కేసుని కొట్టివేస్తున్నట్లు మద్రాస్ హైకోర్టు తీర్పు చెప్పింది.
ఇటువంటి సంబంధంలో ఉన్న ప్రేమ జంటలన్నీ ఇలా కోర్టు వరకు రాకపోవచ్చు. కానీ వస్తే ఇలాంటి తీర్పు కూడా వస్తుందని గ్రహించేందుకు ఈ తీర్పు ఓ చక్కటి ఉదాహరణ. కనుక ప్రేమ-శారీరిక సంబంధాలు-పెళ్ళి మూడింటినీ కలపాలో వద్దో ఎవరికీ వారే అఆలోచించుకోవాలి.







