రెండు రోజుల క్రితం ప్రారంభమైన త్రివిక్రమ్ – పవన్ కళ్యాణ్ ల సినిమా షూటింగ్ రికార్డు స్థాయిలో పూర్తి కానున్న విషయం తెలిసిందే. త్రివిక్రమ్ కెరీర్ లో ఇప్పటివరకు దర్శకత్వం వహించిన సినిమాలలో అతి తక్కువ రోజుల్లో పూర్తి కానున్న సినిమాగా రికార్డులకెక్కనుంది. ఈ సినిమా షూటింగ్ లో ఉన్నానంటూ ఒక హీరోయిన్ అను తన ఫోటోను పోస్ట్ చేయగా, మరో హీరోయిన్ కీర్తి సురేష్, షూటింగ్ లో పాల్గొనబోతున్నానని ట్వీట్ చేసింది. దీంతో పవన్ తో పాటు చిత్ర ప్రధాన తారాగణం అంతా కూడా ఈ ఫస్ట్ షెడ్యూల్ లోనే పాల్గొనబోతున్నారు.
దీనికి సంబంధించి తాజాగా ఓ ఫోటో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఓ హీరోయిన్ ను పవన్ కౌగిలించుకుని ఉన్న ఈ ఫోటోలో పవన్ రొమాంటిక్ గా కనపడుతున్నారు. నిజానికి పవన్ హావభావాలు స్పష్టంగా కనిపించకపోయినా, ఫుల్ షేవింగ్ తో ‘ఖుషి’ సినిమాలో మాదిరి స్టైలిష్ గా తయారైనట్లు కనపడుతున్నారు. దీంతో ముందు ప్రచారం జరిగినట్లుగా ఈ సినిమా ఎలాంటి ప్రయోగం కాదని, ఓ ఫక్తు కమర్షియల్ సబ్జెక్ట్ తో పవన్ – త్రివిక్రమ్ లు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారని స్పష్టమైంది.
పవన్ సినిమా సంగతి ఇలా ఉంటే, షూటింగ్ మొదలుపెట్టి దాదాపుగా ఒక ఏడెనిమిది నెలలు ముగుస్తున్నా, ఇంతవరకు ఫస్ట్ లుక్ విడుదల చేయని ప్రిన్స్ మహేష్ బాబు సినిమా ప్రస్తుతం చెన్నైలో షూటింగ్ జరుగుతోంది. ఇటీవలే వియత్నాంలో కళ్ళు చెదిరే యాక్షన్ దృశ్యాలను చిత్రీకరించినట్లుగా చెప్తుండగా, తాజాగా చెన్నైలో కూడా ఫైటింగ్ సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోందని స్పష్టమవుతోంది. దీనికి సంబంధించి కూడా ఓ ఫోటో సోషల్ మీడియాలో సర్క్యూలేట్ అవుతోంది.
ట్రైన్ పక్కనే నిలబడి ఉన్న ప్రిన్స్, ఫైటింగ్ లో మూడ్ లో ఉన్నట్లుగా కనపడుతున్నాడు. ఇలా ఇద్దరి టాప్ హీరోల సినిమాల షూటింగ్ కు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో అభిమానులను పలకరించడంతో ఫ్యాన్స్ కు నిజమైన పండగ వచ్చినట్లయ్యింది. మరో వైపు జూనియర్ ఎన్టీఆర్ తన లేటెస్ట్ సెన్సేషన్ ‘జై లవకుశ’ టైటిల్ లోగోతో ప్రేక్షకులను పలకరించగా, మరో హీరో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ‘బాహుబలి 2’ సినిమా ప్రమోషన్స్ లో తలమునకలై ఉన్నారు.



