పెద్ద సినిమాల మొదటి రోజు కలెక్షన్స్ ఓ రేంజ్ లో కుమ్మేయాలని చిత్ర నిర్మాతలు టికెట్ ధరలు పెంచుతున్న వైనం చూస్తూనే ఉన్నాం. ‘బాహుబలి, శ్రీమంతుడు’ సినిమా సక్సెస్ నుండి ఇటీవల ‘సర్ధార్ గబ్బర్ సింగ్’ సినిమా వరకు మొదటి రోజు టికెట్ ధరలు అమాంతంగా పెంచేయడంతో తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. అయితే ఈ వారంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ‘బ్రహ్మోత్సవం’ సినిమాకు మాత్రం నైజాం డిస్ట్రిబ్యూటర్ ‘అభిషేక్ పిక్చర్స్’ సరికొత్త ప్లాన్ తో ముందుకు వచ్చారు.
హైదరాబాద్ తో పాటు తెలంగాణా వ్యాప్తంగా ‘బ్రహ్మోత్సవం’ సినిమా తొలి రోజు నాడు ప్రతి ధియేటర్లో 5 షోలను ప్రదర్శించనున్నారు. టికెట్ ధరలను పెంచే కన్నా కూడా, సాధారణ టికెట్ ధరలతోనే మరో షో ప్రదర్శన పెంచితే అటు ఎక్కువ మంది ఆడియన్స్ వీక్షించడంతో పాటు, ఇటు డిస్ట్రిబ్యూటర్ కు కూడా దాదాపు మరో కోటి రూపాయల వరకు అదనంగా కలెక్షన్స్ పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో తొలి రోజే దాదాపు 6 కోట్ల వరకు వసూలు చేస్తుందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. తెలంగాణాలో పరిస్థితి ఇలా ఉంటే, ఏపీలో బెనిఫిట్ షోల ప్రదర్శనకు ఇప్పటివరకు ఎలాంటి అనుమతులు ఇవ్వలేదు.



