భరత్ అను నేను విజయం ఇచ్చిన జోరుతో సూపర్ స్టార్ మహేశ్బాబు ఈ రోజు విజయవాడలో పర్యటించారు. ఈ సంధర్భంగా రాజకీయాలపై ఆయన ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసారు. తనకు వందేళ్లు వచ్చే వరకూ సినిమాల్లోనే నటిస్తానని స్పష్టంచేశారు. తాను రాజకీయాల్లోకి రానని వెల్లడించారు.
విజయవాడలోని డీవీ మానర్ హోటల్లో మహేశ్బాబు శుక్రవారం చిన్నారులను కలిశారు. గుండె చికిత్స చేయించుకున్న చిన్నారులతో కలిసి కాసేపు సందడి చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. విజయవాడ రావడం చాలా ఆనందంగా ఉందని, ఇక్కడికి రావడం సెంటిమెంట్గా ఫీలవుతానన్నారు. ఒక్కడు, పోకిరి, దూకుడు వంటి విజయోత్సవ సభలు విజయవాడలోనే నిర్వహించిన సంగతిని గుర్తుచేసుకున్నారు.
`భరత్ అను నేను` చిత్రానికి ఘన విజయం అందించిన అభిమానులకు ఈ సందర్భంగా ఆయన కృతజ్ఞతలు చెప్పారు. అంతకు ముందు ఆయన విజయవాడ కనక దుర్గ దర్శనం చేసుకున్నారు. మహేష్ తో పాటు ఆయన బావ గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ కూడా ఉన్నారు. చిత్ర దర్శకుడు కొరటాల శివ కూడా వచ్చారు.



