ఏనుగు చచ్చినా పది వరహాలే, బతికి ఉన్నా పది వరహాలే అన్నట్లుగా మహేష్బాబు సినిమా సూపర్ హిట్ అయినా, అట్టర్ ఫ్లాప్ అయినా ఆయన క్రేజ్ మాత్రం తగ్గడం లేదు. సినిమా సినిమాకు క్రేజ్ పెరుగుతూనే ఉంది. శ్రీమంతుడు సినిమా సూపర్ హిట్ అవ్వడంతో ‘బ్రహ్మోత్సవం’ సినిమాకు మహేష్బాబు రేంజ్ పెరిగింది. అయితే ‘బ్రహ్మోత్సవం’ అట్టర్ ప్లాప్ అయినా కూడా మహేష్ తర్వాత సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మహేష్ ఇప్పటికే తన తర్వాత సినిమాను మురుగదాస్ దర్శకత్వంలో చేసేందుకు కమిట్ అయిన విషయం తెల్సిందే. దాదాపు 110 కోట్ల బడ్జెట్తో మహేష్ తర్వాత సినిమా తెరకెక్కబోతుంది.
తమిళంలో స్టార్ డైరెక్టర్ అయిన మురుగదాస్ తెలుగులో కూడా మంచి క్రేజ్ను సొంతం చేసుకున్నాడు. బాలీవుడ్లో కూడా ఈయన సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. దాంతో మహేష్బాబు, మురుగదాస్ల కాంబోలో తెరకెక్కే సినిమా తెలుగు, తమిళం, హిందీ భాషల్లో విడుదల కాబోతుంది. అందుకు తగ్గట్లుగానే దర్శకుడు మురుగదాస్ ప్లాన్ చేస్తున్నాడు. సినిమా ఇంకా పట్టాలెక్కలేదు, అప్పుడే రిలయన్స్ ఎంటర్టైన్మెంట్స్ సంస్థ ఈ సినిమాను 150 కోట్లకు కొనేందుకు ముందుకు వచ్చినట్లుగా ప్రచారం జరుగుతోంది. అన్ని భాషల థియేట్రికల్ రైట్స్కు 150 కోట్లు పెట్టేందుకు రిలయన్స్ సిద్దంగా ఉన్నట్లుగా తెలుస్తోంది.
మహేష్బాబు సినిమాకు ఈ స్థాయి బిజినెస్ అవ్వడం టాలీవుడ్ వర్గాల వారు సైతం ఆశ్చర్యంను కలిగిస్తోంది. మహేష్బాబుపై నమ్మకమా లేక మురుగదాస్పై నమ్మకమో కాని రిలయన్స్ వారు ఇంత మొత్తం ఈ సినిమాపై పెట్టేందుకు సిద్దం అయ్యారు. త్వరలోనే ఢీల్ కుదిరే అవకాశాలు ఉన్నాయని సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఇదే కనుక నిజం అయితే నిర్మాతలకు లాభాల పంట పడటం ఖాయం అని ట్రేడ్ వర్గాల వారు అంటున్నారు.



