మహేష్ తో ఒక్కసారి పని చేసిన దర్శకులు మళ్ళీ మళ్ళీ చేయాలనుకుంటారు. ఇదేమి కొత్త విషయం కాదు. అయితే అలా రెండవసారి జత కట్టిన వారిలో ఒక్క పూరీ జగన్నాధ్ మినహా మరెవరూ మహేష్ కు హిట్ ను అందివ్వలేకపోయారు. అందుకే పూరీ – ప్రిన్స్ కాంబో అంటే ప్రత్యేకం. ఇప్పటికే రెండు సార్లు కలిసిన ఈ జోడి, ముచ్చటగా మూడో సారి “జనగణమన” కోసం కలవాల్సి ఉంది. ఈ టైటిల్ మరియు సినిమా ఉంటుందని ప్రకటించి, దాదాపుగా ఏడాది గడిచినా, పూచిక పుల్ల కూడా ముందుకు కదల్లేదు.
దీనికి తోడు ‘మహేష్ నుండే స్పందన రావాలి, తన పనైపోయింది’ అంటూ ఇటీవల పూరీ బహిరంగంగా తెలపడంతో, ఇక ఈ సినిమాకు ‘శుభంకార్డు’ పడిపోయింది అన్న ప్రచారం జరిగింది. అలాగే మరో వైపు వరుసగా పూరీ దారుణ పరాజయాలు చవిచూస్తుండడంతో… పూరీని ప్రిన్స్ పక్కనపెట్టి ఉంటారన్న అంశానికి మరింత బలం తోడయ్యింది. కానీ, ఇవన్నీ తాత్కాలికమే అన్న విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ సినిమాపై గందరగోళానికి తెరదించుతూ పూరీ జగన్నాధ్ చేసిన ప్రకటన ప్రిన్స్ అభిమానులకు స్పష్టతనిచ్చింది.
తన డ్రీం ప్రాజెక్ట్ అయిన “జనగణమన” మహేష్ తోనే ఉంటుందని, ఇటీవలే ఫుల్ స్క్రిప్ట్ తో మహేష్ కలిసి కధను చెప్పాను, వచ్చే సంవత్సరంలో ఈ సినిమా మొదలు అవుతుందని క్లారిటీ ఇచ్చారు. ఒక స్క్రిప్ట్ కోసం సాధారణంగా నెలకు మించి సమయాన్ని వెచ్చించని జగన్, ఈ స్క్రిప్ట్ కోసం మాత్రం ఏకంగా రెండు నెలల పాటు రచించడం విశేషం. అంత పక్కాగా సమయం తీసుకోవడానికి కారణం… ఎంతైనా తన డ్రీం ప్రాజెక్ట్ కదా..! ప్రస్తుతం నందమూరి నటసింహం బాలకృష్ణతో పూరీ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.



