‘జనసేన’ అధినేత పవన్ కళ్యాణ్ – తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ ల భేటీ రాజకీయంగా ఎంతటి హాట్ టాపిక్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వ్యవసాయానికి 24 గంటల విద్యుత్ సరఫరా చేస్తున్నందుకు అభినందించడానికి గానూ వచ్చానని పవన్ విన్నవించుకున్నప్పటికీ, రాజకీయంగా ఇదొక “డిజాస్టర్” స్టెప్ గా రాజకీయ విశ్లేషకులు తేల్చేసారు. దీంతో అయోమయం, గందరగోళంలో ‘జనసేన’ కార్యకర్తలు, పవన్ అభిమానులు ఉన్నారు.
ఇదిలా ఉంటే, అసలు పవన్ కళ్యాణ్ వెళ్ళింది వేరే ఉద్దేశమని, ఈ నెల 10వ తేదీన విడుదల కాబోతున్న “అజ్ఞాతవాసి” ప్రీమియర్ షో పర్మిషన్ల కోసమని మహేష్ కత్తి లాంటి వాళ్ళు తీవ్ర విమర్శలు చేసారు. పవన్ కున్న అభిమాన బలానికి కేసీఆర్ బలగం తోడు కావడానికి ఈ భేటీ అంటూ మండిపడ్డారు. ఈ విమర్శలలో ఎంత వాస్తవం ఉన్నప్పటికీ, రాజకీయ విమర్శలు ఇలాగే ఉంటాయన్నది తెలియనిది కాదు. అయితే ఇలాంటి వారికి అవకాశం కల్పించింది, నోరు మెదిపేలా చేసింది స్వయంగా పవన్ కళ్యాణ్ అన్నది ఇక్కడ గమనించాల్సిన అంశం.
ప్రీమియర్ షో అనుమతుల కోసం స్వయంగా పవన్ వెళ్ళాల్సిన అవసరం ఉండదు, అలాగే గంటసేపు వేచిచూడాల్సిన ఆవశ్యకత కూడా ఉండదు. మహేష్ కత్తి చేసింది ఒక రాజకీయ విమర్శ మాత్రమేనని అందరికీ తెలిసిన విషయమే అయినా… పవన్ వేస్తోన్న అడుగులు ఇలాంటి వారికి మరిన్ని అవకాశాలను కల్పిస్తోందన్నది రాజకీయ విశ్లేషకుల మాట. మొత్తానికి పవన్ – కేసీఆర్ ల భేటీ నూతన సంవత్సరంలో మొదటి రోజు తీవ్ర ప్రాధాన్యతను సంతరించుకునేలా చేసింది.



