ఓ సాధారణ ఫ్యాంటు, బనియన్ ధరించి ఎర్ర టవల్ ఒకటి మెడలో వేసుకుని స్టైలిష్ గాగుల్స్ పెట్టుకుని, హైదరాబాద్, కూకట్ పల్లిలో మంచు వారి వారసుడు హీరో విష్ణు ‘పానీపూరీ… పానీపూరీ…’ అంటూ అమ్మకాలు ప్రారంభించాడు. రొటీన్ బండి వాడి దగ్గర కాకుండా, కళ్లద్దాలు ధరించిన ఈ స్టైలిష్ వర్తక వ్యాపారి మంచు విష్ణు వద్ద పానీపూరీ కొనుక్కుని తినేందుకు జనాలు బారులు తీరారు.
తన సోదరి మంచు లక్ష్మి ప్రసన్న నిర్వహిస్తున్న ‘మేము సైతం’ కార్యక్రమంలో భాగంగా తన వంతు ఆర్థిక సాయం క్రింద మంచు విష్ణు ఈ అవతారం దాల్చాల్సి వచ్చింది. ‘మేము సైతం’ ద్వారా వచ్చే డబ్బును సేవా కార్యక్రమాలకు వినియోగిస్తున్న విషయం తెలిసిందే. తన తండ్రి చేత ఇడ్లీలు, ఇపుడు సోదరుడు చేత పానీపూరీ అమ్మకానికి మంచు వారి ఆడపడుచు కారణమైందంటూ సినీ జనాలు హుషారుగా చెప్పుకుంటున్నారు.
మంచు వారి కుటుంబ సభ్యులను మినహాయిస్తే… మాస్ మహారాజా రవితేజ, భళ్ళాలదేవుడు రానా, నాచురల్ స్టార్ నాని, అక్కినేని ప్రిన్స్ అఖిల్, స్టార్ హీరోయిన్లు శ్రియ, రకుల్ ప్రీతి సింగ్, రెజీనాలు మరియు స్వరమంత్రికురాలు యాంకర్ సుమ తదితరులు ‘మేము సైతం’ కోసం ఇప్పటికే తమ వంతు పాత్ర నిర్వహించిన విషయం తెలిసిందే.



