మన మంత్రులు ఎప్పుడూ చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్లను విమర్శించడానికి లేదా తమ మాటకారితనం ప్రదర్శిస్తూ వారిని ఎద్దేవా చేయడానికి మాత్రమే పరిమితమవుతుంటారు. తెలంగాణ మంత్రులు కూడా రాజకీయాలు మాట్లాడుతుంటారు కానీ అంతకంటే ఎక్కువగా తమ ప్రభుత్వం చేసిన అభివృద్ధిపనుల గురించే ఎక్కువగా మాట్లాడుతుంటారు.
అంబటి రాంబాబు ఏపీ జలవనరుల శాఖ మంత్రి అయినప్పటికీ ఈ నాలుగేళ్ళలో ఆయన తన శాఖకు సంబందించిన విషయాలు లేదా పనుల గురించిమాట్లాడిన సందర్భాలు చాలా అరుదు. ఎందుకంటే జలవనరుల శాఖ, దానిలో జరిగే పనులు చాలా హెవీ సబ్జెక్ట్. ప్రాజెక్టులు, సాగునీరు గురించి మాట్లాడాలంటే చాలా లోతైన అవగాహన, ఆ శాఖపై పూర్తి పట్టు ఉండాలి.
అదే… చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్లను ఎద్దేవా చేస్తూ సోషల్ మీడియాలో ట్వీట్స్ పెట్టడడం, మీడియా సమావేశాలు పెట్టి వారిని విమర్శించడం చాలా సులువు. బహుశః అందుకే వాటితోనే ఆయన కాలక్షేపం చేస్తుండటం అందరూ చూస్తూనే ఉన్నారు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి వాహనంలో ఉభయ గోదావరి జిల్లాలో పర్యటిస్తూ ప్రజలందరినీ వైసీపీకి వ్యతిరేకంగా, జనసేనకు అనుకూలంగా ఏకం చేసేందుకు ప్రయత్నిస్తుండటంతో వైసీపీ నేతలలో తీవ్ర ఆందోళనచెందుతున్నారు. అమరావతిని పాడుబెట్టి, ఆక్వా రైతుల నడ్డి విరుస్తున్నందుకు ఉభయ గోదావరి జిల్లాలో ప్రజలు వైసీపీపై తీవ్ర అసంతృప్తితో ఉండటం సహజం. కనుక పవన్ కళ్యాణ్కు మంచి జనాధారణ లభిస్తోంది. ఇది వైసీపీకి చాలా కలవరపరిచేదే. కనుక సిఎం జగన్, మంత్రులు ఆయనపై ఎదురుదాడి చేస్తున్నారు.
అయితే ‘వారాహి’ అంటే అమ్మవారి పేరని తెలియక దానిని పందితో పొలుస్తూ ‘వరాహి’ అని ముఖ్యమంత్రి నోరు జారారు. దానికి వివరణ ఇచ్చుకొనేందుకు, అంబటి రాంబాబు మీడియా ముందుకువచ్చి, వారాహికి వారాహికి తేడా తమకు తెలుసని, అయితే అమ్మవారి పేరు పెట్టుకొన్న వాహనంపై పవన్ కళ్యాణ్ తిరుగుతుండటం వలననే తాము ఆ వాహనాన్ని పందితో పోల్చామని సర్దిచెప్పుకొన్నారు.
పవన్ కళ్యాణ్ ఈవిదంగా అమ్మవారి పేరు పెట్టుకొన్న వాహనంపై తిరుగుతుండటం వలన ఆయన సినిమాలన్నీ ఫ్లాప్ అవుతాయని, రాజకీయంగా ఎదురుదెబ్బ తింటాడని అంబటి రాంబాబు జోస్యం పేరుతో మనసులో ద్వేషాన్ని వెళ్ళగ్రక్కారు. శాపనార్ధాలు పెట్టారు. అయితే ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పాలన సాగిస్తున్నట్లయితే పవన్ కళ్యాణ్ని చూసి ఇంతగా ఉలిక్కి పడవలసిన అవసరం ఉండేదే కాదు కదా?



