సత్తెనపల్లిలో కన్నా అప్పుడే పని మొదలెట్టేశారే

Minister Ambati Rambabu Follower YSRCP Legal Cell Joined TDPమంత్రి అంబటి రాంబాబు మీడియా సమావేశాలు పెట్టి లేదా సోషల్ మీడియాలో చంద్రబాబు నాయుడు, పవన్‌ కళ్యాణ్‌ల మీద సెటైర్లు వేస్తూ కాలక్షేపం చేస్తుంటే, సత్తెనపల్లి సీటు ఖరారు చేసుకొన్న కన్నా లక్ష్మినారాయణ నిశబ్ధంగా పని మొదలుపెట్టేశారు.

అంబటి రాంబాబు ప్రధాన అనుచరుడు, నియోజకవర్గం వైసీపీ లీగల్ సెల్ అధ్యక్షుడు, ప్రముఖ న్యాయవాది బత్తుల ఆదినారాయణను టిడిపిలో రప్పించారు. ఆయనకు టిడిపి కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.

ADVERTISEMENT

ఈ సందర్భంగా కన్నా లక్ష్మినారాయణ సత్తెనపల్లిలో విలేఖరులతో మాట్లాడుతూ, “ఏపీలో జగన్‌ రాక్షస పాలన అంతమోదించి రాష్ట్రాన్ని మళ్ళీ ప్రగతి బాట పట్టించడానికి అందరూ కలిసి రావాలని మా విజ్ఞప్తిని మన్నించి బత్తుల ఆదినారాయణ టిడిపిలో చేరడం మాకు చాలా సంతోషం కలిగించింది. చంద్రబాబు నాయుడి అపార రాజకీయ, పరిపాలనానుభవంలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం మళ్ళీ నిలద్రొక్కుకొని అభివృద్ధిపదంలో ముందుకు సాగగలదు. కనుక రాష్ట్రంలో ఈ రాక్షస పాలన అంతమోదించేందుకు న్యాయవాదులు, మేధావులు అందరూ కలిసిరావాలని మరోసారి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను,” అని అన్నారు.

బత్తుల ఆదినారాయణ కాపునాడు ఉమ్మడి జిల్లా అధ్యక్షుడుగా కూడా పనిచేశారు. కనుక ఆయన టిడిపికి కాపు సామాజిక వర్గం మద్దతు కూడా కూడగట్టగలరని భావించవచ్చు.

మంత్రి అంబటి రాంబాబు పేరుకి జలవనరుల శాఖ మంత్రి అయినప్పటికీ తన శాఖలో జరుగుతున్న లేదా జరగాల్సిన పనుల గురించి మీడియాతో మాట్లాడిన సందర్భాలు చాలా అరుదు. మంత్రిగా తన పనితీరుతో ప్రజల మెప్పు పొందాల్సిన అంబటి రాంబాబు, సక్రాంతికి సత్తెనపల్లిలో రోడ్లపై డ్యాన్సులు చేస్తూ ఆకట్టుకోవాలని ప్రయత్నిస్తుంటారు.

తన పనితీరు, ప్రజాధారణ ఏవిదంగా ఉన్నప్పటికీ, చంద్రబాబు నాయుడు, పవన్‌ కళ్యాణ్‌, నారా లోకేష్‌లను అవహేళన చేస్తూ తమ అధినేత జగనన్నను మెప్పిస్తే చాలు వచ్చే ఎన్నికలలో ఆయనే తనను గెలిపించుకొంటారని గట్టి నమ్మకంతో ఉన్నట్లున్నారు.

నిజానికి వైసీపీలో చాలామంది మంత్రులు, ఎమ్మెల్యేలది ఇదే ధోరణి. కనుక వచ్చే ఎన్నికలలో 175 సీట్లు గెలిచే భారం సిఎం జగన్మోహన్ రెడ్డిదే తప్ప వైసీపీ నేతలది కాదనే భావించాల్సి ఉంటుంది.

ADVERTISEMENT
Latest Stories