రాష్ట్రంలో వైసీపీ నేతల ప్రవర్తన చూస్తుంటే “అందితే జుట్టు అందకపోతే కాళ్ళు” అనే సామెత గుర్తు రాకమానదు.తమ అధికార అహం బయటకు వస్తే అది మీడియా అయినా, ప్రభుత్వ ఉద్యోగి అయినా, ప్రతిపక్ష పార్టీల నేతలైనా, సాధారణ ప్రజలైనా…తమకు ఒక్కటే అన్నట్టు వైసీపీ నేతలైనా, వారి అనుచరులైనా, చివరికి మంత్రులైన ఒకే తీరుగా నడుచుకుంటారు.
తాజాగా రేణుగుంట ఎయిర్ పోర్టులో జల వనరుల శాఖ మంత్రి అంబటిని కలిసిన మీడియా ప్రతినిధులను ఆయన సిబ్బంది వెనక్కి నెట్టేయడంతో మంత్రిని ప్రశ్నించిన సదరు జర్నలిస్టులను అవమానపరిచేలా చేసిన అంబటి వ్యాఖ్యలు ఇప్పుడు మీడియాలో చర్చకు దారి తీశాయి.ఏంటమ్మా విషయం ఏమిలేదుగా,ఇప్పుడేం చేద్దాం, మీ పని మీరు చూసుకోండి అంటూ వెటకారంగా బదులిస్తూ తన కారులో వెళ్లిపోయారు.తమకు అధికారం ఉంది అనే అహంకారం తన మాటలతోనే రుజువుచేశారు మంత్రి గారు.
ఇదిలా ఉంచితే..వైసీపీ పార్టీ నేతలు నిర్వహిస్తున్న సామాజిక సాధికార యాత్ర సభలలో వైసీపీ నేతల ప్రవర్తన ఇందుకు భిన్నంగా కనపడుతుంది.కొన్ని కొన్ని సభలో కాళీ కుర్చీలకు సైతం తమ ప్రసంగాలను ఇస్తున్న వైసీపీ నేతలు, మరికొన్ని చోట్ల ప్రసంగాలు మొదలుపెట్టగానే కుర్చీలని కాళీ చేస్తున్న ప్రజలను వేడుకుంటూ వైసీపీ నేతలు పడుతున్న పాట్లు కనిపిస్తున్నాయి.ఇలా తమకు తప్పదు అనుకునే సందర్భాలలో ప్రజలకు దండాలు పెడుతూ వేడుకుంటున్న వైసీపీ నేతలను చూస్తున్నాం.
అలాగే తమకున్న అధికారమనే హోదాతో ప్రతిపక్ష నేతల మీద భౌతిక దాడులకు తెగబడిన వైనం,ప్రత్యర్థుల పైన అక్రమ కేసులు మోపి అరెస్టులు, జైళ్లు , బైళ్ళు అంటూ న్యాయస్థానాల చుట్టూ తిప్పే వైసీపీ అధికార అహంకారం,రాష్ట్రంలో అణగారిన వర్గాల మీద రోజురోజుకి పెరుగుతున్న వైసీపీ అనుచరుల దాష్టికాలు ఎన్నో. తమకు అడ్డొస్తే ప్రభుత్వ ఉద్యోగినైనా వదిలిపెట్టేది లేదు అనడానికి ఎన్నో సాక్ష్యాలను సామజిక మాధ్యమాలలో ప్రజలు చూస్తూనే ఉన్నారు.
ఇలా వైసీపీ పార్టీ నేతలు “కుదిరితే దాడులు కుదరకపోతే దండాలు” అనే పాలసీని నమ్ముకుని రాష్ట్రంలో తమ రాజకీయాన్ని కొనసాగిస్తున్నారు.రానున్న ఎన్నికలలో ప్రజలు కూడా ఈ పాలసీ నచ్చితే ‘ఓటు’…నచ్చకపోతే ‘వేటు’… అనే బటన్ నొక్కి తమ ప్రతిస్పందన తెలియచేయనున్నారు.




