మాయ మాటలతో ప్రజలను మభ్య పెట్టవచ్చు కానీ ఉద్యోగులను కాదు

minister botsa satyanarayana talk with union leaders వైసీపీ ప్రభుత్వం 95 శాతం హామీలు అమలుచేసిందని మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పుకొంటే, ప్రభుత్వ హామీని నమ్మి మోసపోయామని ఉద్యోగ సంఘాలు అంటున్నాయి. శుక్రవారం అమరావతిలో మంత్రులు బొత్స సత్యనారాయణ, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి సిపిఎస్‌పై చర్చించేందుకు ఉద్యోగ సంఘాల నేతలతో సమావేశమయ్యారు.

సిపిఎస్‌ అమలుచేస్తే కేంద్రం నుంచి వచ్చే నిధులు రావని కనుక జీపీఎస్‌ విధానాన్ని అమలుచేస్తామని మంత్రులు చెప్పారు. జీపీఎస్‌ విధానంలో ఉద్యోగులకు ఏవైనా అభ్యంతరాలు ఉన్నట్లయితే వాటిని తెలియజేయాలని మంత్రులు కోరారు. అవసరమైతే దానిలో మార్పులు చేర్పులు చేసేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉందని చెప్పారు.

ADVERTISEMENT

మంత్రులతో సిపిఎస్‌ గురించి మాట్లాడాలని వస్తే, వారు జీపీఎస్ గురించి మాట్లాడటంతో ఉద్యోగ సంఘాల నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. సిపిఎస్‌ అమలుచేయడం సాధ్యం కాదని తెలిసి ఉన్నప్పుడు అమలుచేస్తామని ఎందుకు హామీ ఇచ్చారని మంత్రులను నిలదీశారు. జీపీఎస్‌ను తాము వ్యతిరేకిస్తున్నామని తెలిసి మళ్ళీ దాని గురించి చర్చించేందుకు తమను పిలవడం దేనికని ప్రశ్నించారు. సిపిఎస్‌లో రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన సొమ్మును ఆరు నెలలుగా ఎందుకు చెల్లించడం లేదని ప్రశ్నించారు. సిపిఎస్‌పై ప్రభుత్వం ఇచ్చిన హామీలను నమ్మి మోసపోయామని రాష్ట్రంలో ఉద్యోగులు అందరూ భావిస్తున్నారని ఉద్యోగ సంఘాల నేతలు మంత్రులకు తెలిపారు. ఇన్ని నెలలుగా చాలా సహనంతో ఎదురుచూస్తున్నా ప్రభుత్వం జీపీఎస్ విధానన్నే బలవంతంగా తమపై రుద్దాలని ప్రయత్నిస్తున్నందున సెప్టెంబర్‌ 1వ తేదీన ‘బ్లాక్ డే’ నిర్వహించి నిరసనలు తెలియజేస్తామని స్పష్టం చేశారు.

ఈవిదంగా నిరసనలు తెలిపితే ప్రభుత్వంలో కదలిక రాదని, సెప్టెంబర్‌ 1వ తేదీన ‘ఛలో విజయవాడ’ నిర్వహించాలని కొన్ని ఉద్యోగ సంఘాలు, తాడేపల్లి సిఎం క్యాంప్ కార్యాలయం ముట్టడించాలని మరికొన్ని సంఘాలు వాదిస్తున్నాయి. ఉద్యోగ సంఘాలు ఇందుకు సిద్దమవుతున్నాయనే భయంతోనే మంత్రులు హడావుడిగా తమను చర్చలకు ఆహ్వానించినట్లు ఉద్యోగ సంఘాల నేతలు భావిస్తున్నారు. కానీ చర్చలు విఫలమైనందున ఉద్యోగ సంఘాలు మరోసారి సమావేశమయ్యి సెప్టెంబర్‌ 1వ తేదీన ‘బ్లాక్ డే’ నిర్వహించాలా లేదా ‘ఛలో విజయవాడ’ నిర్వహించాలా? అనే దానిపై చర్చించుకొని నిర్ణయం తీసుకొంటామని చెప్పారు.

మంత్రులు బొత్స, బుగ్గన చెప్పుకొంటున్నట్లు వైసీపీ ప్రభుత్వం 95 శాతం హామీలు అమలుచేస్తే, ఉద్యోగులు ఎందుకు నిరసనలు తెలియజేస్తున్నట్లు? ‘ఛలో విజయవాడ’ ఆలోచన ఎందుకు చేస్తున్నారు? సిఎం క్యాంప్ కార్యాలయం ముట్టడించాలని ఎందుకు అనుకొంటున్నారు?మాయ మాటలతో ప్రజలను మభ్య పెట్టవచ్చు కానీ ఉద్యోగులను కాదని గ్రహిస్తే మంచిది.

ADVERTISEMENT
Latest Stories