ధర్మాన ప్రసాదరావు ఏపీ రెవెన్యూ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత శుక్రవారం సొంత జిల్లా శ్రీకాకుళంకి వచ్చినప్పుడు ఆయన అనుచరులు, వైసీపీ కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు. ఆయన కూడా హుషారుగా కారు దిగి చిరునవ్వులు చిందిస్తూ అందరికీ షేక్ హ్యాండ్స్ ఇస్తున్నారు. ఓ కార్యకర్త అత్యుత్సాహంతో మంత్రిగారి చేయి అందుకొనేందుకుముందుకు తోసుకురావడంతో ధర్మానకి చిర్రెత్తుకు వచ్చింది. అంతే… చూట్టూ జనం, కెమెరాలతో మీడియా ఉన్నారని కూడా చూడకుండా అతని చెంప చెళ్ళు మనిపించేశారు. దీంతో మంత్రిగారి చుట్టూ ఉన్నవారు షాక్ అయ్యారు.
ఇదంతా మీడియా ప్రతినిధులు కెమెరాలలో చిత్రీకరిస్తుండటంతో మంత్రిగారి అనుచరులు ఆ కార్యకర్తను పక్కకు తీసుకుపోయారు. కానీ అప్పటికే మంత్రిగారి ప్రతాపం కెమెరాలలో రికార్డ్ అయిపోవడంతో నేడు దాదాపు అన్ని న్యూస్ ఛానల్స్లో ‘కార్యకర్తపై మంత్రిగారి ప్రతాపం,’ అంటూ ఆ క్లిప్పింగ్తో వార్తలు వచ్చేశాయి. అది చూసి ప్రజలు కూడా ఆశ్చర్యపోయారు. ‘ఎంతైనా మంత్రిగారు కదా…ఆ మాత్రం దూకుడు ఉంటుందని’ సరిపెట్టుకోక తప్పదు. కనుక ఇక ముందు వైసీపీ కార్యకర్తలు కూడా ఆయన చేతికి అందనంత దూరంలో నిలబడితే మంచిదేమో?



